Supreme Court: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పవర్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు లిస్ట్ అయింది. రేపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గడ్తో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో దర్యాప్తు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో పవర్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. మాజీ సీఎం కేసీఆర్కు రెండు సార్లు నోటీసులు కూడా పంపింది. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి కూడా నోటీసులు పంపింది.
పవర్ కమిషన్ పంపిన నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సుదీర్ఘ లేఖ రాసి నిరసన వ్యక్తం చేశారు. అసలు కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత లేదని, దర్యాప్తు అధికారి నర్సింహారెడ్డి కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. దర్యాప్తు పూర్తి కాకుండానే మీడియా సమావేశం నిర్వహించి తన పేరును ప్రస్తావించడాన్ని అభ్యంతర పెట్టారు. తన హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.
Also Read: హరీశ్ రావు బీజేపీలోకి రావొచ్చు.. కానీ: బండి సంజయ్
ఆ తర్వాత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పవర్ కమిషన్ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఉన్నత న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చింది. పవర్ కమిషన్ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పవర్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
గతంలో కేసీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా కమిషన్ వేసుకోవాలని సూచించారని, ఎలాంటి అవకతవకలు జరగలేవని చెప్పారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వారి సూచనల మేరకే పవర్ కమిషన్ వేశామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు దర్యాప్తునకు హాజరై తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం మంచిది కదా అని చెబుతున్నారు.