Heavy Rain alert to Hyderabad: హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ పేర్కొన్నది. అప్పటివరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
నగరంలోని చందానగర్, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి, కూకట్ పల్లి, మూసాపేట, హైదర్ నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, అమీర్ పేట్, నేరేడ్ మెట్, ఎర్రగడ్డ, సనత్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, మేడ్చల్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగల్, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుండ, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వరద నీరు రోడ్లపైకి చేరుకోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతుంది.
భారీ వర్షానికి రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. మెట్రో స్టేషన్ల కింద మోకాల్లోతు వరద నీరు వచ్చి చేరింది. యూసుఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. ఈ వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది.
Also Read: హరీశ్ రావు బీజేపీలోకి రావొచ్చు.. కానీ: బండి సంజయ్
మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మారేడ్ పల్లిలో అత్యధికంగా 75.3 మిల్లీ మీటర్లు, ఖైరతాబాద్ లో 74 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శేరిలింగంపల్లిలో 58 మిల్లీమీటర్లు, షేక్పేట-54, మాదాపూర్ -53 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Also Read: త్వరలోనే మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క
ఇదిలా ఉంటే.. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు సమాచారం. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించినట్టు తెలుస్తోంది.