Visakha Files Will Releases Soon: టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ అంతటా గమనిస్తే విశాఖలో ఎక్కువగా ఆ పార్టీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వేలాది ఎకరాలు భూకబ్జాలకు పాల్పడ్దారన్నది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ.
తాజాగా ఈ వ్యవహారంపై నోరు విప్పారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. త్వరలో విశాఖ ఫైల్స్ విడు దల చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. విశాఖలోని భూఆక్రమణలకు పాల్పడినవారిలో సీఎస్ స్థాయి వ్యక్తులు ఉన్నారని విమర్శించారు.
వైసీపీ భూకబ్జాల గురించి చిట్టా మొత్తం వివరిస్తామని వెల్లడించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖలో కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 30 రోజులకే కీలక హామీలకు శ్రీకారం చుట్టిందన్నారు. డీఎస్సీ, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాటిపై సంతకాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం
మరోవైపు విశాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఇప్పటికే రిజిస్టార్ ఆఫీసుల నుంచి డీటేల్స్ తీసుకున్నారు. భీమిలి, అనకాపల్లి, విశాఖ-విజయనగరం మధ్య దాదాపు వేలాది ఎకరాలు బంధువుల పేరుతో నేతలు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు అంతర్గత సమాచారం. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన డీటేల్స్ తీసుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ భూఆక్రమణల వ్యవహారం తీగలాగితే డొంక కదలడం ఖాయమన్నమాట.