ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు జిల్లాపరిషత్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారగానే జడ్పీ రాజకీయం కూడా మరిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత జడ్పీ పాలకమండలి 2021 జూలైలో ఏర్పడింది. అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల నుంచి మొత్తం 55 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు వైసీపీకి చెందిన వారే ఎన్నికయ్యారు. ఇక జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలతో పాటు 12 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది వైసీపీ వారే గెలిచారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు పలకడంతో జిల్లా పరిషత్లో పూర్తిగా వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. జడ్పీ చైర్పర్సన్గా దర్శి జెడ్పీటీసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ కొనసాగుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉండటంతో జడ్పీ సమావేశాలకు పెద్దగా సమావేశాలకు హాజరుకాలేదు. దాంతో ప్రశ్నించేవారు లేక జెడ్పీ సమావేశాలు మొక్కుబడిగానే ముగిసేవి. ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిన జడ్పీ పాలకమండలి సమావేశాలు ఇకపై అలా జరిగే పరిస్థితి లేకుండా పోయింది.
Also Read: Nadendla Manohar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు
ప్రకాశం జిల్లా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ జడ్పీ చైర్పర్సన్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ పదవిలో వున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తల్లి వెంకాయమ్మను తప్పించి తమ వారిని ఆ సీట్లో కూర్చోపెట్టే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే జిల్లా పరిషత్లో మూడేళ్లుగా సాగుతున్న వైసీపీ ఆధిపత్యానికి బ్రేకులు పడనున్నాయి. జడ్పీలో జడ్పీటీసీ సభ్యులు ఓటు అర్హత ఉన్న సభ్యులు అయినప్పటికీ.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా వుండే ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రత్యేకించి ఎమ్మెల్యేలు సమావేశాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. సమావేశ నిర్వహణ బాధ్యత జడ్పీ చైర్పర్సన్దే అయినా ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ప్రభుత్వం తరపున సమావేశంలో పాల్గొని నడిపిస్తుంటారు.
ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తాజా ఎన్నికల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీడీపీకి చెందిన వారు గెలుపొందగా.. జిల్లాతో సంబంధం ఉన్న మూడు ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీకి చెందినవారే విజయం సాధించారు. జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయస్వామిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. అది కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరుడి కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీపై బూచేపల్లి విజయం సాధించారు.
Also Read: వైసీపీ, టీడీపీ మధ్య ఉత్తరాంధ్ర పంచాయతీ.. ఎవరు రైట్ ..?
జిల్లాలో పది చోట్ల గెలిచిన టీడీపీ, దర్శిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతోందంట. అందుకే జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి తల్లి వెంకాయమ్మను దింపాలని ప్లాన్ చేస్తోందంట. దర్శిలో ఓడిన గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్పర్సన్ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గొట్టిపాటి అనుకున్నట్లు జడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి బూచేపల్లి వెంకాయమ్మను దింపడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. 55 మంది జడ్పీటీసీ సభ్యుల్లో కనీసం 28 మందిని టీడీపీలో చేర్చుకుంటే జడ్పీ పీఠం టీడీపీ వశమవుతుంది.
ఆ లెక్కలతోనే టీడీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందంట. ఎన్నికల ముందు వైసీపీ నుంచి నలుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరగా, మరికొందరు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటితో టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకో 24 మంది సభ్యులు అవసరం కాగా, మంత్రితో టచ్లో ఉన్నవారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నవారు లిస్టు చాలా ఎక్కువే ఉందంటున్నారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైంది.
Also Read: Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిపై కుట్రలు చేసింది ఆయనేనా?
జడ్పీ పీఠం నుంచి చైర్పర్సన్ను దించేయాలంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నాలుగేళ్ల పదవీకాలం తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకో ఏడాది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే పంచాయతీలు, మండలాల అభివృద్ధిలో జడ్పీ కీలకమవ్వడంతో జడ్పీ పీఠం తమ ఆధీనంలో ఉండాలని భావిస్తున్న టీడీపీ అవసరమైతే.. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే విషయాన్ని పరిశీలిస్తోందంటున్నారు. మొత్తానికి ప్రకాశం జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే టార్గెట్గా టీడీపీ స్కెచ్ రెడీ చేస్తోందంట. ఒక్క జడ్పీటీసీ కూడా లేని టీడీపీ.. ఏకంగా చైర్మన్ పీఠనికి గురిపెట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.