India Vs Pakistan World Championship Legends 2024 Final Match Highlights: వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజండ్స్ -2024 ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ గెలిచి ప్రపంచకప్ సాధించింది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మన తెలుగువాడు అంబటి రాయుడు అదరగొట్టాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో భారత్ లెజండ్స్ అద్భుతంగా ఆడి కప్ తీసుకొచ్చారు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది.
పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్ మ్యాచ్ కావడంతో మళ్లీ అందరిలో ఒక హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో అందరి ఫోకస్ ఈ మ్యాచ్ పై పడింది. వివరాల్లోకి వెళితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కి సరైన ప్రారంభం దక్కలేదు. ఓపెనర్ షర్జీల్ ఖాన్ (12) వెంటనే అయిపోయాడు. మరో ఓపెనర్ కమ్రాన్ అక్మల్ (24), షోయబ్ మక్సద్ (21) కాసేపు ఆడారు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా సాగిపోతుందని అంతా అనుకున్నారు.
Also Read: Shubman Gill: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్
సరిగ్గా 8.2 ఓవర్ల తర్వాత కమ్రాన్ అక్మల్ అయిపోయాడు. అప్పటికి స్కోరు 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. వికెట్లు అయితే పడలేదు. కానీ రన్ రేట్ మాత్రం నెమ్మదిగా సాగింది. ఈ సమయంలో వచ్చిన షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ యూనిస్ ఖాన్ (7), మిస్బా ఉల్ హక్ (18) రిటైర్డ్ అయ్యాడు. చివర్లో సొహైల్ తన్వీర్ (19 నాటౌట్ ) గా నిలిచాడు. ఆమీర్ యామిన్ (7), ఆఫ్రిది (4 నాటౌట్) ఇలా ఆడటంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
భారత్ బౌలింగులో వినయ్ కుమార్ 1, అనురీత్ సింగ్ 3, పవన్ నేగి , ఇర్ఫాన్ పఠాన్ 1 వికెట్ పడగొట్టారు. లెజండరీ బౌలర్ హర్భజన్ సింగ్ కి వికెట్లు పడలేదు.
157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (10) త్వరగా అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ అంబటి రాయుడు మాత్రం అదరగొట్టాడు. 30 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో కరెక్టుగా హాఫ్ సెంచరీ అంటే 50 పరుగులు చేశాడు. తర్వాత సురేశ్ రైనా (4) ఇలా వచ్చి అలా అయిపోయాడు. ఇంక అంతా అయిపోయిందని అనుకున్నారు.
Also Read: హెడ్ కోచ్గా తప్పుకున్న రిక్కీ పాంటింగ్.. డీసీ కామెంట్ ఏమిటంటే?
ఆ సమయంలో వచ్చిన గుర్ కీరత్ సింగ్ 33 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. దీంతో భారత్ మళ్లీ లక్ష్యం వైపు సాగిపోయింది. అప్పుడు కెప్టెన్ యువరాజ్ (15 నాటౌట్) ఒకవైపు ఉండిపోయాడు. ఈ సమయంలో వచ్చిన యూసఫ్ పఠాన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. తను కేవలం 16 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 30 పరుగులు చేశాడు. ఇవే మ్యాచ్ విజయంలో కీలకంగా పనిచేశాయి. చివర్లో యువరాజ్ కి తోడు ఇర్ఫాన్ (5 నాటౌట్) నిలిచాడు. మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చాడు. అలా 19.1 ఓవర్ లో 5 వికెట్ల నష్టానికి భారత్ 159 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.
పాకిస్తాన్ బౌలింగులో అమీర్ యామిన్ 2, సయ్యిద్ అజ్మల్ 1, వహాబ్ రియాజ్ 1, షోయబ్ మాలిక్ 1 వికెట్ పడగొట్టారు.
ఇటీవల టీమ్ ఇండియా టీ 20 ప్రపంచకప్ గెలిచింది. తాజాగా జింబాబ్వే సిరీస్ ను యువ జట్టు గెలిచింది. ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు ఏం చేశారంటే ప్రపంచ ఛాంపియన్స్ ఆఫ్ లెజండ్స్ ట్రోఫీని సాధించి, భారత్ కి ఘనకీర్తిని తీసుకొచ్చారు. కుర్రాళ్లు ఓడారు, ముసలోళ్లు కూడా ఓడారని పాకిస్తాన్ లో జనం అక్కడ క్రికెటర్లని తిట్టుకుంటున్నారు.