BJP: బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతున్నదని, బిడ్డ కవిత కోసం కేసీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని, ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పెద్దలతో కేటీఆర్, హరీశ్ రావులు జరిపిన చర్చలు సఫలమైనట్టు తనకు ప్రాథమిక సమాచారం ఉన్నదని వివరించారు. ఈ డీల్లో భాగంగానే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు త్వరలోనే బీజేపీలో చేరుతారని చెప్పారు. కేసీఆర్ స్వయంగా వారిని బీజేపీలోకి పంపిస్తున్నారని తెలిపారు.
వాస్తవానికి ఇది బీజేపీ ప్రయోగమని, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రయోగం చేయగా.. ఇప్పుడు తెలంగాణలో చేపడుతున్నదని ఎంపీ చామల ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రాంతీయ పార్టీలను పాతర పెడుతుందని, ఏపీలో టీడీపీ రాజ్యసభ ఎంపీలను అలాగే చేర్చుకుని టీడీపీకి ద్రోహం చేసిందని వివరించారు. ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావులను బీజేపీ లాక్కుందని, అయినా.. టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిందని చెప్పారు. ఇప్పుడు ఇదే విధానాన్ని బీజేపీ తెలంగాణలో కూడా అమలు చేయనుందని ఎంపీ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆరే స్వయంగా బీజేపీలోకి పంపిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కపట మాటలు మాట్లాడుతున్నారని, వాస్తవానికి దేశంలో రాజ్యాంగాన్ని ఎవరు కించపరుస్తున్నారో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. పదేళ్లలో పది ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదన్నారు. ఇవి కిషన్ రెడ్డికి కనిపించలేవా? అని నిలదీశారు. ప్రభుత్వాలను కూల్చిన విషయంలో సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్న చరిత్ర ఆ పార్టీదేనని ఎద్దేవా చేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న నీచమైన చరిత్ర బీజేపీదేనని ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీకి చెందిన కిషన్ రెడ్డి ఫిరాయింపులపై నీతులు చెప్పడం విచిత్రంగా ఉన్నదని ధ్వజమెత్తారు.
నిన్న గాక మొన్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన రామ్ నివాస్ రావత్ను జులై 9న సీఎం మోహన్ యాదవ్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన రామ్ నివాస్ రావత్ తన పదవికి రాజీనామా చేయలేదని, ఆయనను బీజేపీ సీఎం తన క్యాబినెట్లోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మరి బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్లో రాజ్యాంగం అవహేళన కాలేదా? అని కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ చరిత్ర కూడా ఇంచుమించు అలాంటిదేనని, 2014లో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ను, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకున్న కేసీఆర్ ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఎంపీ చామల తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఒకే డీఎన్ఏ అని, అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్లు కవల పిల్లల వంటివారని సెటైర్ వేశారు. అసలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా ఎలా గెలిచారో తెలియదా? అని బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని పేర్కొన్నారు.