Uttar Pradesh: బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సారికే కన్ను లొట్టబడి గెలిచిన బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని సొంత పార్టీ నేతల అభిప్రాయాలే వస్తున్నాయి. బీజేపీకి ప్రస్తుతం కంచుకోటగా అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీ రాష్ట్రంలోనూ బీటలు వారుతున్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పని అయిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం గల్లంతు కావడం ఖాయం అని జోస్యం చెబుతున్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల సరళి ఈ వైఖరిని బలపరుస్తున్నది. చాలా సీట్లను బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలకు కోల్పోయింది. స్వయానా ప్రధాని మోదీ తన వారణాసి స్థానంలో కొన్ని రౌండ్లలో వెనుకంజ పట్టడం బీజేపీ అధిష్టానాన్ని కూడా ఆలోచనలో పడేసింది. దక్షిణాదిలో కొంత పుంజుకోవడంతో బీజేపీ బతికి బట్టకట్టింది.
యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేలా లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా చెబుతున్న మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బద్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ చంద్ర మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యూపీలో మా పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదు. పార్టీ అధిష్టానం తక్షణమే నష్టనివారణ చర్యలు తీసుకోకుంటే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోదు’ అని స్పష్టం చేశారు.
‘సమాజ్వాదీ పార్టీ వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక వర్గాల సమస్యలను సీరియస్గా తీసుకుంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కలలు కంటే మాత్రం ప్రతి కార్యకర్త తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అధిష్టానం వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి. అయినా పరిస్థితులు మారుతాయని చెప్పలేం’ అని రమేశ్ చంద్ర మిశ్రా వివరించారు.
ఈ వీడియోపై ఓ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు స్పందిస్తూ.. బీజేపీ నేతలకు తత్వం బోధపడినట్టుందని, రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని వారికి కూడా అర్థమైనట్టుందని కామెంట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఇంటికి వెళ్లక తప్పదని పేర్కొన్నారు.