YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. వైనాట్ 175 అని గంభీరంగా బరిలోకి దిగిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా కూటమి జాగ్రత్తపడటంతో అపూర్వ విజయాన్ని అందిపుచ్చుకుంది. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ సారథిగా ప్రచారం చేస్తూ ప్రధానంగా వైఎస్ జగన్ను టార్గెట్ చేశారు. చివరి దశలో కడపలో ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయ వారసత్వం, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ జగన్కు మధ్య తేడాలు ఏకరువుపెడుతూ చాలా డ్యామేజీ చేసింది. కాంగ్రెస్ గెలవకున్నా.. వైసీపీ ఓటమికి మాత్రం ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పవచ్చు. వైఎస్ షర్మిల వైసీపీని తొక్కేయడంలో దాదాపు సక్సెస్ అయ్యారు.
ఐతే, వైఎస్ షర్మిల అంతటితో వైసీపీని విడిచిపెట్టేలా లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆమె టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక వైపు అధికార టీడీపీని విమర్శిస్తూనే.. అందుకు రెట్టింపుగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇందుకు తాజాగా తల్లికి వందనం పథకం అంశం కేంద్రంగా మారింది.
తల్లికి వందనం పథకం వివరాలు చూస్తే.. ప్రతి తల్లికి నిధులు అందిస్తామని ఉన్నదని, తద్వార ఇంటిలోని పిల్లలందరికీ ఈ డబ్బులు ఇవ్వరా? కేవలం ఇంట్లో ఒకరికే ఈ పథకం వర్తిస్తుందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ స్పష్టతను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే, ఇంట్లో ఉన్న ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ. 15వేలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి పత్రికను చూపిస్తూ మాట్లాడారు. తల్లికి వందనం ఎగనామం అంటూ సాక్షి రాసిందని, సాక్షి యజమానికి తాను చెప్పిన మాటను తప్పిన విషయం గుర్తుకు లేదేమోనని సెటైర్ వేశారు.
అమ్మ ఒడి కింద ప్రతి పిల్లాడికి డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో జగన్ చెప్పాడని, తనతో కూడా చెప్పించారని, కానీ, తీరా అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం మాట తప్పిందని వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ జగన్ కూడా ఇలాగే.. ప్రతి తల్లికి అమ్మ ఒడి అందిస్తామని చెప్పి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తున్నదని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ పై అపనిందలు వేస్తున్నదని ఆరోపణలు గుప్పించాయి.
ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల మరోసారి స్పందించి వైసీపీ పై విరుచుకుపడ్డారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలాగే వైసీపీ నేతల తీరు ఉన్నదని విమర్శించారు. సాక్షి పత్రికను చూపిస్తూనే చంద్రబాబు వివరణ ఇవ్వాలని తాను అడిగానని, ప్రతి పిల్లాడికి రూ. 15 వేల చొప్పున తల్లికి వందనం అందించాలని డిమాండ్ చేశానని.. కానీ, కాంగ్రెస్ పార్టీ బాబుకు తోకపార్టీ అని ముడిపెట్టడమంటే అది వారి అవగాహనరాహిత్యానికి నిదర్శనం అని నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలకు కళ్లుండి, చెవులుండి అవి పని చేస్తే.. విజ్ఞత కలిగిన వాళ్లే అయితే తాము చెప్పింది ఒకటికి పది సార్లు వినాలని హితవు పలికారు. తాము నిన్న ప్రెస్ మీట్లో నిలదీసినందుకు నేడు చంద్రబాబు ప్రభుత్వ వివరణ ఇచ్చుకుందని తెలిపారు.
2019 ఎన్నికలకు ముందు మాట ఇచ్చి నిలువున మోసం చేసింది వైసీపీ కాదా? అని వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఆ రోజ తన చేత కూడా ఊరూరా, ప్రతి చోట ప్రచారం చేయించింది నిజం కాదా? అని నిలదీశారు. వైసీపీ కోసం బైబై బాబు క్యాంపెయిన చేయడం ఎంత నిజమో.. అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ. 15 వేల చొప్పున ప్రతి తల్లికి ఇస్తామని తన చేత ప్రచారం చేయించడం కూడా అంతే నిజమని స్పష్టం చేశారు.