Kapil Dev Comes to Help ex-India Cricketer to Fight Cancer: భారతదేశంలో క్రికెట్ .. నేడిలా విశ్వవ్యాప్తం కావడానికి ప్రధాన కారణం 1983లో మనవాళ్లు సాధించిన వరల్డ్ కప్. అంతవరకు క్రికెట్ కామెంటరీ రేడియోల్లోనే వచ్చేది. చాలా అరుదుగా అభిమానులు రేడియోలను చెవుల్లో పెట్టుకుని పార్కుల్లో, కాలేజీ గ్రౌండ్లలో వినేవారు. ఫోర్లు కొడితే కేకలు పెట్టేవారు. అలాంటి పరిస్థితి నుంచి భారతదేశంలో క్రికెట్ ఇంత స్థాయికి ఎదిగిందంటే వెనుక ఎందరో మహానుభావులున్నారు.
అలాంటి వారిలో ఒకరు అన్షుమన్ గైక్వాడ్. తను 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్ట్లు, 15 వన్డేలు ఆడాడు. అంతేకాదు టీమ్ ఇండియాకు రెండుసార్లు హెడ్ కోచ్ గా పనిచేశాడు. అలాంటి తను ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో ఏడాదికాలంగా బాధపడుతున్నాడు. ఇప్పుడతని పరిస్థితిని వివరిస్తూ లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బీసీసీఐకి లేఖ రాశాడు.
అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, అతడికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అవసరమైతే తమ పెన్షన్ డబ్బులను ఇస్తామని తెలిపాడు. మాజీ క్రికెటర్లను ఆదుకునేందుకు బీసీసీఐ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాడు. బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న అన్షుమన్ ఏడాది కాలంగా ఇంగ్లండ్లో చికిత్స అందుకుంటున్నాడు.
Also Read: నేడే లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్
ఈ సందర్భంగా అతనితో క్రికెట్ బంధాన్ని వివరించాడు. అన్షుమన్ తో కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడాను. గ్రౌండులో నాటి వెస్టిండీస్ బౌలర్లలాంటి ఎందరో వేసే భయంకర బాల్స్ ను ఎదిరించి నిలిచాడు. కానీ ఇప్పుడు క్యాన్సర్ ని ఎదిరించలేక పోరాడుతున్నాడు. సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, మదన్ లాల్, కీర్తి ఆజాద్, మొహిందర్ అమరనాథ్, నేను అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. మాజీ హెడ్ కోచ్కు సహాయం చేసేందుకు బీసీసీఐ కూడా ముందుకు వస్తే బాగుంటుంద“ని కపిల్ పేర్కొన్నాడు.
నేటి తరం క్రికెటర్లకు కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. వాళ్లు సంపాదించుకున్నారు. కానీ నాటి తరం క్రికెటర్లలో అది లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకనే అందరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. అన్షుమన్ గైక్వాడ్ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే తమ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ అన్నాడు.