Prakash Ambedkar: రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంచిత్ బహుజన్ అఘాదీ వ్యవస్థాపకుడైన ప్రకాశ్ అంబేద్కర్ నేడు రాజ్యాంగంపై జరుగుతున్న రాజకీయ రచ్చపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు సవాల్ విసిరారు. ‘మీరు నిజంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే.. మీకు నిజంగానే రాజ్యాంగపై ప్రేమ గనుక ఉంటే మనుస్మృతిని దహనం చేయండి’ అంటూ సవాల్ చేశారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిజంగా రాజ్యాంగాన్ని ప్రేమించినట్టయితే నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు మనుస్మృతి పుస్తకాలను దహనం చేయాలని నేను డిమాడ్ చేస్తున్నా’ అంటూ చాలెంజ్ చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా రాజ్యాంగాన్ని తీవ్రంగా గాయపరిచాయి. అణగారిన, వెనుకబడిన కులాలు, వర్గాలను అనాదిగా ఈ పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయి. ఈ పార్టీలు బాబాసాహెబ్ ఆదర్శాలను, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను భంగపరిచాయి’ అని విరుచుకుపడ్డారు.
కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య రాజ్యాంగం విషయమై వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో, ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని ప్రముఖంగా చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు కూడా రాజ్యాంగాన్ని చేతపట్టుకునే ఉన్నారు. అధికార బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీనే ఖూనీ చేసిందని ఆరోపణలు చేస్తున్నది.ఇందుకోసం గత ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అమలు చేసిన ఎమర్జెన్సీని బూచీగా చూపుతున్నది.
ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ అమలు చేసిన జూన్ 25వ తేదీన రాజ్యాంగ హత్య దినంగా పాటించాలని, ఎమర్జెన్సీ కాలంలో ఎందరో ఇబ్బందులు పడ్డారని, వారి స్మరణగా ఈ రోజును గుర్తుంచుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ వెంటనే గెజిట్ నోట్ను కూడా విడుదల చేసింది. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఖండించింది. అలాగైతే ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పిన ఫలితాల వెలువడిన రోజు జూన్ 4ను మోదీ ముక్తి దివస్గా పాటించాలని జైరాం రమేశ్ కామెంట్ చేశారు. రాజ్యాంగాన్ని సంఘపరివారం వ్యతిరేకించిందని, రాజ్యాంగ నిర్మాతలు మనుస్మృతిని ప్రేరణగా తీసుకోలేదని నిరసించారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమేనని, కానీ, రాజ్యాంగవిరుద్ధం కాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖండించారు.