Revanthreddy : ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సీబీఐ అందరినీ ఢిల్లీకి పిలించిందని.. కవిత విచారణకు మాత్రం ఆపవ్షన్లు, అనుమతి కోరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు.
నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములపై విచారణ చేపట్టాలని రేవంత రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఢిల్లీలో ఐదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్ 6లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని అన్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని రేవంత రెడ్డి అన్నారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.