AP EAPCET 2024 Counselling 2024: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ మేరకు కౌన్సెలింగ్లో కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 1.23 లక్షల మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
వెబ్ ఆప్షన్ల నమోదు కోసం జులై 8 నుంచి జులై 12 వరకు అవకాశం కల్పించారు. అయితే వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు జులై 13న అవకాశం కల్పించారు. ఈ మేరకు నేటి అర్ధరాత్రి వరకు ఆప్షన్లకు మార్పు చేసుకునేందుకు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అంతకుముందు ఆప్షన్లను మార్పు చేసుకోవడంతోపాటు కొత్త ఆప్షన్లను కూడా పెట్టుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా..ప్రైవేట్ కాలేజీల ఫీజులు, అనుమతుల జారీలో వెబ్ ఆప్షన్ల నమోదు ఆలస్యమైంది. దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీల సమాచారం సైతం ఆలస్యంగానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. చివరికి ఫీజుల విషయంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదును యధావిధిగా నిర్వహించారు.
జులై 16న సీట్ల కేటాయింపు ఉండగా.. జులై 17 నుంచి 22 వరకు విద్యార్థులకు అలాట్ చేసిన కాలేజీల్లో ప్రవేశం పొందాల్సి ఉంటుంది. అనంతరం జులై 19 నుంచి కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు.
అంతకుముందు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. ఈ ఫీజులు 2026-27 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మొత్తం పది వర్సిటీలకు కొత్త ఫీజులు ఖరారయ్యాయి. ఇందులో తొమ్మిది వర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి.