Jagruthi Consultancy : డిగ్రీలు పూర్తి చేసుకుని.. పట్టా అందుకుని క్యాంపస్ నుంచి బయటికొచ్చాక ప్రతి విద్యార్థికి ఎదురయ్యే మొదటి సమస్య ఉద్యోగం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురుచూడటమే తప్ప.. అంతత్వరగా ఉద్యోగాలు రావడం లేదు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలొచ్చినా.. ఆఫర్ లెటర్స్ కు చాలా సమయమే పడుతోంది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. కొందరు నిరుద్యోగులు.. ఉద్యోగం వస్తుందన్న ఆశతో కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు.
ఆ కన్సల్టెన్సీలు మాకింత కట్టండి.. అంత ప్యాకేజీతో మీకు ఉద్యోగం గ్యారెంటీ అని మాయమాటలు చెప్పి లక్షలకు లక్షలు దండుకుంటున్నాయి. ఉద్యోగం ఏది అని తిరిగి ప్రశ్నిస్తే.. చాలా కష్టంగా ఉంది. కొంత సమయం పడుతుందని కాలం గడుపుతూ వచ్చి.. ఆఖరికి బోర్డు తిప్పేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని జాగృతి కన్సల్టెన్సీ చేసిన పని ఇది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షలు వసూలు చేసి.. మొహం చాటేసింది.
దాదాపు 1200 మంది నుంచి.. మనిషికి రూ.2 లక్షల చొప్పున రూ.24 కోట్ల రూపాయలను వసూలు చేసింది జాగృతి కన్సల్టెన్సీ. బాధితుల నుంచి తీసుకున్న డబ్బుంతా దండుకుని.. ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి జీతాలివ్వకుండా బోర్డు తిప్పేసింది జాగృతి సంస్థ. జాగృతి కన్సల్టెన్సీ డైరెక్టర్ జగదీశ్ తమకు ఉద్యోగాల ఆశచూపి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.