Amararaja : అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఏపీలో అగ్గిరాజేసింది. వైఎస్ఆర్ సీపీ నేతల వేధింపుల వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని టీడీపీ నేతలు ఎటాక్ కు దిగారు. ఏపీ ప్రభుత్వంపై ఎల్లోమీడియా , టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ ఎదురుదాడికి దిగింది. అమరరాజా పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ మారింది.
తెలంగాణలో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యూనిట్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా సంస్థ ఒప్పందం చేసుకుంది. మొత్తం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అమరరాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ టీడీపీ గుంటూరు ఎంపీ కావడంతో రాజకీయంగా వివాదం రేగింది. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడంపై టీడీపీ, వైఎస్ఆర్ సీపీ మధ్య వివాదాన్ని రాజేసింది. అమరరాజా పరిశ్రమను ఏపీ ప్రభుత్వం వేధించడం వల్లే ఇప్పుడు తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్న మాట.
రంగంలోకి చంద్రబాబు
రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను చెడగొడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని ఆరోపించారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడం, దాడులతో వేధించడం, అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ఏపీ ప్రతిష్టను రోజురోజుకీ దిగజారుస్తోందని విమర్శించారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలంలో లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమరరాజా సంస్థ నిలిచిందన్నారు. అలాంటి కంపెనీ ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని చంద్రబాబు మండిపడ్డారు.
ధూళిపాళ్ల ఫైర్
ఏపీలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్ బినామీలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవాల్సిందేనన్నారు. ప్రభుత్వ వేధింపులు, వైఎస్ఆర్ సీపీ నేతల వసూళ్లు తట్టుకోలేక ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్ఫ్లోకు బదులుగా రివర్స్ఫ్లో జరుగుతోందన్నారు. ఉన్న పరిశ్రమలను బెదిరించి తమ వారికి కట్టబెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాకినాడ సెజ్, గంగవరం పోర్టు విషయంలో ఇదే జరిగిందని తెలిపారు.
వైఎస్ఆర్ సీపీ కౌంటర్..
టీడీపీ విమర్శలపై వైఎస్ఆర్ సీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు.పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలో ఉందని.. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇబ్బంది పెడితే ప్రియ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు.