YS Sharmila to be target jagan party through operation congress
రాజకీయాలు వేరు..రక్తబంధాలు వేరు. తమ్ముడు తమ్ముడే ..పేకాట పేకాటే అన్న చందంగా మారిపోయాయి నేటి రాజకీయాలు. ఒకే కుటుంబంలో రక్త సంబంధాలను, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్లు వేరయిపోతున్నారు రాజకీయాల పుణ్యమా అని. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ డ్రామా ప్రస్తుతం అలానే నడుస్తోంది. రాజకీయంగా సొంత అన్న జగన్ ని కాదనుకుని తెలంగాణ వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టి సక్సెస్ కావాలని అనుకుంది వైఎస్ షర్మిల.దాని కోసం ఏకంగా తెలంగాణలో విజయవంతంగా పాదయాత్రలు చేపట్టి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుంది షర్మిల.ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం..ఏపీలో తన అన్న పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
అన్నాచెల్లెళ్లకు చేదు అనుభవాలు
ఎన్నికల ఫలితాలు అన్నాచెల్లెళ్లకు చేదు అనుభవాలనే ఇచ్చాయి. అనూహ్యంగా తెలుగు దేశం కూటమి విజయం సాధించి జగన్, షర్మిలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ముఖ్యంగా షర్మిల అనుకున్నదొకటి..అయ్యిందొకటి. తాను కాంగ్రెస్ లో చేరగానే గతంలో వైఎస్ హయాంలో అండగా నిలచిన సీనియర్ కాంగ్రెస్ నేతలంతా తిరిగి సొంత గూటికి వచ్చేస్తారని షర్మిల అంచనాలు వేసుకుంది. అది కాస్తా బెడిసికొట్టింది. ఎందుకంటే నాటి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అప్పటికే వైఎస్ఆర్ సీపీలో చేరిపోయారు. జగన్ పార్టీనుంచి టిక్కెట్ రాని ఆశావహులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపించలేదు. వైనాట్ 175 అంటూ ప్రచారం ేసుకున్న జగన్ కేవలం 11 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. అయితే ఈ ఎన్నికలలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పోటీనిచ్చే లెవెల్ కు ఎదగాలని చూస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్
ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ సీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేదు. ఇదే సమయంలో షర్మిల ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టాలని భావిస్తోంది. మొన్నటి వైఎస్ ఆర్ జయంతిని జగనన్నకు ధీటుగా కాంగ్రెస్ తరపున ఓ ఉత్సవంలా జరిపించి సక్సెస్ చేసింది షర్మిల. ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఆ ప్రోగ్రాం ప్రత్యేక ఆకర్షణగా తయారయింది. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని రేవంత్ ఇచ్చిన సూచనతో షర్మిల ఇప్పుడు జగన్ పార్టీని టార్గెట్ చేసినట్లు సమాచారం.
ప్రధాన జిల్లాల నేతలు టచ్ లో..
ఇప్పటికే అన్ని జిల్లాలలో వైఎస్ జగన్ పార్టీలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలతో షర్మిల టచ్ లో ఉండి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల ముందు నిందికొట్కూరు ప్రముఖ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ షర్మిల కాంగ్రెస్ తరపున పోటీచేసేలా ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చింది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన బ్రదర్స్, మరికొందరు రాయల సీమ, అనంతపురం నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం.
అధిష్టానం గ్రీన్ సిగ్నల్
2029 నాటికైనా కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చేలా షర్మిల పావులు కదుపుతోంది ఇప్పటినుంచే. ఇప్పటినుంచే పార్టీలో చేరితే ముందు ముందు తమ సీనియారిటీని అనుసరించి పదవులు వస్తాయని పలువురు నేతలు భావిస్తున్నారు. అందుకే మంచి ముహూర్తం చూసుకుని జగన్ పార్టీ కండువాలను మార్చేసుకోవాలని..కాంగ్రెస్ లో చేరాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అధిష్టానం కూడా ఓకే అనడంతో మరింత ఉత్సాహంతో ఉన్నారు షర్మిల.