Bus Accident in Odisha(Today latest news telugu): ఒడిశా రాష్ట్రంలో సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మయూర్ భంజ్ జిల్లా బెత్నాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధిఖమర్ చౌక్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు వెనుక నుంచి ఆగి ఉన్న ట్రక్కు ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.