ZIM vs IND 4th T20 : జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా యువజట్టుకి నేడు హరారేలో జరగనున్న నాల్గవ వన్డే కీలకంగా మారనుంది. ఇప్పటికే 2-1తో ముందడుగులో ఉన్న టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే 3-1తో సిరీస్ గెలుస్తుంది. లేదంటే మాత్రం 2-2 తో సమానమవుతుంది. ఇక చివరికి 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో ఆఖరిమ్యాచ్ టెన్షన్ టెన్షన్ అవుతుంది. అందుకనే ఎలాగైనా సరే, మ్యాచ్ ని గెలిచి సిరీస్ గెలవాలని గిల్ సేన తీవ్రంగా సాధన చేస్తోంది.
భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే జింబాబ్వే కూడా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. గట్టిపోటీ ఇచ్చే జట్టుగా నిలవాలని చూస్తోంది. అయితే గిల్ సారథ్యంలో టీ 20 సిరీస్ కి బయలుదేరిన తర్వాత శ్రీలంక పర్యటనకు సారధిగా మాత్రం హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గిల్ ని ప్రయోగాత్మకంగా వాడారని అర్థమవుతోంది.
మరి ప్రస్తుతం గిల్ టీ 20ల్లో ఆడుతున్న విధానం చూసి పలు అనుమానాలు నెట్టింట వినిపిస్తున్నాయి. మొదట్లో 16 ఓవర్ల వరకు జిడ్డు బ్యాటింగ్ ఆడుతూ, చివర్లో కొట్టి బాల్, రన్స్ మధ్య తేడా చూపిస్తున్నాడు. పొరపాటున ఈ మధ్యలో అయిపోతే, అది జట్టుకి భారంగా మారే అవకాశాలున్నాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ద్రవిడ్ కంటే ముందు.. రోహిత్ రూ. 5 కోట్లు వదిలేశాడా?
జైస్వాల్, గిల్, అభిషేక్, రుతురాజ్ల రూపంలో నలుగురు ఓపెనర్లు టాప్ ఆర్డర్ లో ఆడాల్సి వచ్చింది. మిడిలార్డర్ బ్యాటర్ లేని లోటును నేటి మ్యాచ్లో భర్తీ చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే అభిషేక్ స్థానంలో రియాన్ పరాగ్కు చాన్స్ ఇవ్వవచ్చు. ఇక బౌలింగ్లో రెండో టీ20లో ఖలీల్ను, మూడో టీ20లో ముకేశ్ను ఆడించలేదు. ఇప్పుడు పేసర్ అవేశ్కు విశ్రాంతినిచ్చి హర్షిత్ కు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.
అటువైపు జింబాబ్వే బౌలింగు అద్భుతంగా ఉంది. వారు చక్కగా నిలువరిస్తున్నారు. కాకపోతే ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల మనవాళ్లు బతికి బట్టకట్టి మ్యాచ్ లు గెలుస్తున్నారు. లేదంటే మొదటి వన్డే తరహాలోనే అవస్థలు పడేవారని సీనియర్లు అంటున్నారు. లాంగ్ ఆన్ బౌండరీ లైన్ల వద్ద సులువైన క్యాచ్ లు వాళ్లు వదిలేస్తున్నారు. దానివల్ల మనవాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి వాళ్లు జాగ్రత్తగా ఆడితే టీమ్ఇండియా యువజట్టుకి చిక్కులు తప్పేలా లేవు. మనవాళ్లేం చేస్తారో చూడాలి మరి.