Power cut in Hyderabad news(Latest news in Hyd):
మొన్నటి సమ్మర్ ఎండలకు విలవిలలాడిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇంకా సమ్మర్ ప్రభావంలోనే ఉన్నారు. జూన్ లో వర్షపాతం బాగా తక్కువగా ఉండటంతో జులై లోనైనా వర్షాలు కురుస్తాయని ఆశించారు. రెండు వారాలవుతున్నా వర్షం చుట్టం చూపుగా చూసి వెళుతోంది. ఇంకా నేల చల్లబడలేదు. తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు నగర ప్రజలు. అసలే ఉక్కపోతతో అలమటిస్తున్న హైదరాబాద్ జనాలకు అప్రకటిత కరెంట్ కోతలు మరింతగా కుంగదీస్తున్నాయి. కరెంటు ఎప్పుడు తీసేస్తారో తెలియదు.అర్థరాత్రి వేళల్లోనూ మంచి నిద్ర సమయంలో కరెంట్ కట్ చేసేస్తున్నారు. దీనితో వృద్ధులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు.
వాగ్దానాలేవి?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 24 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పటిదాకా బాగానే నడిపించింది. ఇటీవల కాలంలో కరెంట్ కోతలపై విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సివస్తోంది. వర్షాకాలంలో వచ్చే మరమ్మతుల కారణంగానే కరెంట్ కోతలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అయినా ఇలాంటివన్నీ వానాకాలం ముందుగానే చూసుకోవాలన్న బాధ్యత లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. చాలాచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడిపోవడం, ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లు, ఫీడర్ల సమస్యలతో కరెంట్ కోతలు విధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఫ్యూజ్ కాల్ ఆఫీసుకు ఫోన్ చేసినా ఎవ్వరూ రెస్పాండ్ అవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే రాజేంద్ర నగర్, బోడుప్పల్, జీడిమెట్ల ప్రాంతాల పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్లను జనం ముట్టడిస్తున్న వార్తలు వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్ అన్నీ పాడవుతున్నాయి
మరికొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు రావడంతో చాలా వరకూ విద్యుత్ ఉపకరణాలన్నీ దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఇళ్లలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్లు దెబ్బతింటున్నాయని జనం అల్లాడుతున్నారు.వేల రూపాయలతో కొనుక్కున్న ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇలా దెబ్బతింటే సామాన్యుల సంగతేమిటని సామాన్యులు అడుగుతున్నారు. సెలబ్రిటీలు, వీఐపీలో ఎక్కువ ఉన్న జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాలలో పగలు, రాత్రి వేళల్లోనూ నిరంతరాయంగా ఏసీలు ఆన్ లోనే ఉంటాయి. పైగా సాఫ్ట్ వేర్ సంస్థలన్నీ ల్యాప్ టాప్, కంప్యూటర్లపైనే ఆధారపడి ఉంటాయి. అప్రకటిత కరెంట్ కోతలతో తమక భారీ స్థాయిలో నష్టాలొస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేసేారు సైతం కరెంట్ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయలేకపోతున్నామని అంటున్నారు. ఇకనైనా రేవంత్ సర్కార్ కరెంట్ కోతలకు స్వస్తి చెప్పేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని అంటున్నారు. లేకపోతే ప్రతిపక్షాల విమర్శలను సీరియస్ గా ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.