Raghuvamshi Apologises Saina Nehwal(Live sports news): బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు కోల్ కతా క్రికెటర్ రఘువంశీ క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్) గా సారీ చెప్పాడు. నెహ్వాల్ చేసిన ట్వీట్ పై అతడు చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో క్షమాపణలు కోరాడు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. క్రికెట్ తో పోల్చుకుంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ తదితర క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవి.. కానీ, అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారంటూ నెహ్వాల్ పేర్కొన్నది.
‘సైనా నెహ్వాల్ ఏం చేస్తోంది..? రెజర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రీడాకారులంతా దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే.. తరచూ పేపర్లలో వస్తుంటారు. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కానీ.. అందరి దృష్టీ క్రికెట్ మీదే ఉంటుందని కొన్నిసార్లు బాధేస్తుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, టెన్నిస్ వంటి పలు క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవి. షటిల్ తీసుకుని సర్వ్ చేసేంత టైం కూడా దొరకదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ.. క్రికెట్ లో అలాంటి పరిస్థితి ఉండదు. అయినా అదే ఎక్కువమందిని ఆకర్షిస్తోంది’ అంటూ నిఖిల్ శర్మ పాడ్ క్యాస్ట్ లో నెహ్వాల్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ చేసింది.
అయితే, ఈ వ్యాఖ్యలు నచ్చని రఘువంశీ స్పందిస్తూ.. ‘బుమ్రా 150 కిలో మీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనేది చూద్దాం’ అంటూ అతను కామెంట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే రఘువంశీ ఆ పోస్టును డిలీట్ చేశాడు. అనంతరం సైనా నెహ్వాల్ కు క్షమాపణలు చెబుతూ మరో పోస్టు పెట్టాడు. ‘అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు సరదాగా తీసుకుంటారనుకున్నాను. కానీ, ఆలోచించే సరికి అది పరిణతి లేని జోక్ గా అనిపించింది. నా తప్పు తెలుసుకున్నాను’ అంటూ రఘువంశీ ఆ పోస్టులో రాసుకొచ్చాడు.
Also Read: ద్రవిడ్ కంటే ముందు.. రోహిత్ రూ. 5 కోట్లు వదిలేశాడా?
2024 ఐపీఎల్ లో కోల్ కతా తరఫున అరంగ్రేటం చేసిన రఘువంశీ తన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడి.. 115.24 స్ట్రైక్ రేట్ తో 163 పరుగులు చేయడంతో అతడిపై ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు.