Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మహారాష్ట్రలో పర్యటించారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతో శ్రీలో కలిశారు. ఠాక్రే కుటుంబాన్ని కలిసిన తర్వాత శరద్ పవార్తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అస్థిరంగా ఉన్నదని, ఎప్పుడు కూలిపోతుందో తెలియదని కామెంట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఐదేళ్లు కూడా అధికారంలో నిలబడేలా లేదని చురకలంటించారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), టీఎంసీలు ఇండియా కూటమిలో భాగమైన పార్టీలే. లోక్ సభ ఎన్నికల తర్వాత దీదీ తొలిసారి వీరితో భేటీ అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రేతో మమతా బెనర్జీకి రాజకీయంగా మంచి అండస్టాండింగ్ ఉన్నదని చెబుతారు.
కేంద్రంలోని ప్రభుత్వం చివరి దాకా కొనసాగదని, ఇది అస్థిర ప్రభుత్వం అని ఠాక్రేతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కామెంట్ చేశారు. ఆట ఇప్పుడే మొదలైందని, అసలు వ్యవహారం ముందున్నదని హెచ్చరికలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తేదీ జూన్ 25ను సంవిధాన్ హత్య దినంగా కేంద్రం ప్రకటించడంపై స్పందన కోరగా.. తాము మర్జెన్సీకి వ్యతిరేకం అని, కానీ, అప్పటి కంటే మోదీ హయాంలోనే ఎమర్జెన్సీ ఎక్కువగా కనిపిస్తున్నదని దీదీ వివరించారు. చాలా ఖ్యమైన విషయాలు కూడా ప్రతిపక్షాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. మూడు కొత్త నేర న్యాయ చట్టాలను కూడా తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఏర్పాటు చేశారని విమర్శించారు. పార్లమెంటులో చాలా మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన ప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా వాటిని ఆమోదించారని గుర్తు చేశారు.
పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితుల గురించి మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ పై పోరాడి తాము అధికారాన్ని ఏర్పాటు చేశామని, అలాంటప్పుడు అవే లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సాధ్యపడదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మంచి ప్రదర్శన కనబరిచిందని కితాబిచ్చారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను వస్తానని వివరించారు. శివసేన నుంచి గుర్తును, పేరును లాక్కోవడం దారుణమని ఆమె ఆక్రోశించారు. అయినా.. ఠాక్రే పార్టీ పులిలా పోరాడిందని గుర్తు చేశారు.