MLA Prakash Goud joins congress(Telangana politics): రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఎప్పుడు ఆ కండువాను తీసేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అయితే, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నేతలు వరుస పెట్టి కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తోపాటు వివిధ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పలువురు నేతలు పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది.
మరోవైపు.. రేపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతారంటూ హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ.. తాను పార్టీ మారడంలేదంటూ చెప్పుకొచ్చారు. చివరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి హరీశ్రావు..?
ఇదిలా ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలగాను 16 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే, ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు.