Hyderabad: కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్లై ఓవర్
పూర్తయిందని, కానీ, దాన్ని ఓపెన్ చేసే నాథుడు లేడని విమర్శించారు. కాబట్టి, సంబంధిత అధికారులు ఆ ఫ్లైఓవర్ను ఓపెన్
చేయాలని సూచించారు. లేదా ప్రజలే తమకు తాముగా ఆ ఫ్లై ఓవర్ను ఓపెన్ చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. గోపన్ పల్లి
ఫ్లైఓవర్ గురించి ఆయన ఈ హాట్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు సంధించారు.
‘అసమర్థ ప్రభుత్వం, ఏమీ తెలియని నాయకుడు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని
తమ ప్రభుత్వం మొదలు పెట్టింది. నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ ప్రజలకు ట్రాఫిక్ ఉపశమనం తేవడంలో
భాగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నాం. కొన్ని నెలల క్రితమే ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. కానీ, ఈ రోజుకి
కూడా ఓపెనింగ్ కోసం ఈ ఫ్లైఓవర్ ఎదురుచూస్తున్నది. ఎందుకంటే సీఎం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు బీఆర్ఎస్ చట్టసభ్యుల ఇళ్ల
చుట్టు తిరగడానికే సరిపోతున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు, సౌకర్యాల కంటే కూడా దాని పీఆర్కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తున్నది.
అందుకే సంబంధిత అధికారులు ఆ ఫ్లైఓవర్ను ఓపెన్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ప్రజలు వారికి
వారుగా ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వినియోగించుకుంటే సరి’ అని ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని కేటీఆర్ విమర్శలు చేస్తున్నప్పటికీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ నాయకులను అప్రోచ్ అవుతున్నారు. పార్టీలో పదవులు లేకున్నా చేరుతున్నారు. నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఈ మేరకు స్పష్టం చేశారు. తమను ఎవరూ భయపెట్టడం లేదని, బలవంతం చేయడం లేదని, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇష్టపూర్తిగా నిర్ణయం తీసుకుని తామే అధికార పార్టీలోకి వెళ్లుతున్నట్టు వెల్లడించారు.