Danam Nagender Comments on KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు కొనసాగుతాయని చెప్పారు. అదేవిధంగా త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ఆయన చెప్పారు. ఆ పార్టీలో మిగిలేది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీని కార్పొరేట్ కంపెనీలా నడిపారంటూ ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంటు కూడా ఇచ్చేవారు కాదన్నారు. ఒకవేళ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారంటూ ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్పైన నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పురుగుల్లా చూసేవారంటూ దానం ఆవేదన వ్యక్తం చేశారు. విలువ లేని చోట ఉండలేకనే కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ విలువ ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండేదని.. బీఆర్ఎస్ వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులే లేవన్నారు.
Also Read: బీజేపీ.. కాంగ్రెస్.. మధ్యలో కేసీఆర్.. రెండు పార్టీల మద్దెల దరువు
కేటీఆర్ బినామీలే రూ. వేల కోట్లు దోచుకున్నారంటూ ఎమ్మెల్యే దానం ఆరోపించారు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడుతానన్నారు. ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.