– పార్టీ నేతలను లాగేసుకుంటున్న కాంగ్రెస్
– ఒకరి తర్వాత ఒకరుగా జంప్
– ఢిల్లీ వెళ్లొచ్చిన కేటీఆర్, హరీష్
– పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సడెన్ మీటింగ్
– బీజేపీ పెట్టిన కండిషన్ ఏంటి?
– రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న కేసీఆర్
KCR in Trouble Between BJP and Congress : బీఆర్ఎస్.. ప్రస్తుతం తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీ. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఈ అంశంపై పలకరిస్తే, కనుమరుగైపోయిన పార్టీ అని అంటారు. వాళ్ల మాటలు ఎలా ఉన్నా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, సాధించిన ఓట్లను బట్టి బీఆర్ఎస్ ప్రాభవం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ప్రచార సమయంలో బీజేపీ, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపుతానన్నారు కేసీఆర్. కానీ, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్యే ఆయన నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
వరుస ఓటముల తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు. ఫాంహౌస్కే పరిమితమయ్యారు. అటు చూస్తే కుమార్తె కవిత జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. కేటీఆర్ మాట వినే నేతలు తక్కువే. ఇదే అదునుగా పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి. పోతే పోండి అన్న ధోరణిలో కేసీఆర్ ఈమధ్యే సమావేశాలు నిర్వహించి ఉన్న లీడర్లకు క్లాసులు తీసుకున్నారు. దొరికిందే ఛాన్స్ అని వరుసబెట్టి నాయకులు జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదనే వాదన జరుగుతోంది. ఇదే సమయంలో ఫాంహౌస్లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన వెంటనే కేసీఆర్ సడెన్ మీటింగ్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఢిల్లీలో వారం రోజులపాటు కేటీఆర్, హరీష్ మకాం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కే బెయిల్ రావడం కష్టమైపోయింది. అలాంటిది, కీలక సూత్రధారిగా పేర్కొన్న కవితకు బెయిల్ రావడం అంత ఈజీ పని కాదు. కానీ, కేటీఆర్ మాత్రం కవితను బయటకు తీసుకొస్తామని శపథం చేశారు. కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలకు ఇదే చెప్పారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఆయన, హరీష్తో కలిసి వారం రోజులు అక్కడే ఉన్నారు. లాయర్లతో అనేక చర్చలు జరిపారు. కవితనూ కలిసి ఓదార్చారు. ఈ టూర్ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. బీజేపీతో కేటీఆర్, హరీష్ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రపోజల్కు కమలనాథులు సరే అన్నారని, కాకపోతే కవితను అప్రూవర్గా మారమని కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని నగరానికి వచ్చీ రాగానే కేసీఆర్కు కేటీఆర్, హరీష్ వివరించినట్టు మాట్లాడుకుంటున్నారు.
నెక్స్ట్ ఏం జరగబోతోంది..?
ఓవైపు బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ లాగేసుకుంటోంది. ఇంకోవైపు పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంటేనే మనుగడ సాధ్యమనే భావనలోకి కేసీఆర్ వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి వారిని ట్యూన్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా కేటీఆర్, హరీష్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.