Congress Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల వలస కొనసాగుతూనే ఉన్నది. నేడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రేపు అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన పార్టీ మార్పుపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పారు. ఎవరిపై బురద జల్లాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ నియోజకవర్గాన్ని కొంత అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు అధికార పార్టీలో చేరితే మరింత అభివృద్ధికి వీలుచిక్కుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు బెదిరించి మరీ బలవంతంగా పార్టీలోకి లాక్కుంటున్నారని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రకాశ్ గౌడ్ ముందు ప్రస్తావించగా.. భయభ్రాంతులకు గురి చేస్తే భయపడటానికి తామేమైనా చిన్న పిల్లలమా? అని ప్రశ్నించారు. బెదిరిస్తే బెదరడానికి తాము చిన్న పిల్లలం కాదని, తాము ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి కూడా బెదిరించాల్సిన అగత్యం లేదని వివరించారు. ఎందుకంటే ఆయనకు స్పష్టమైన మెజార్టీ ఉన్నదని, బెదిరించాల్సిన అవసరం ఆయనకు కూడా లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి యువకుడు, తెలివైన నాయకుడు, ప్రజా సమస్యలు తెలిసినవాడని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మరో పదేళ్లు తప్పకుండా ఆయన అధికారంలో ఉంటారని నమ్మకంగా చెప్పారు. కాబట్టి, తమ అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. రేవంత్ రెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉన్నదని, ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటారని చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే హ్యాపీగా ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారే నమ్మకం ఉన్నదని వివరించారు.
చంద్రబాబుతో కలిసిన తర్వాత పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, చంద్రబాబు నాయుడు తమ రాజకీయ గురువు అని, అందుకే ఆయనను కలిశానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చెప్పారు. అంతేకానీ, పార్టీ మార్పు నిర్ణయానికి చంద్రబాబుతో సమావేశానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రమైన ఏపీని అభివృద్ధి చేయడమే తన ప్రథమ కర్తవ్యం అని, ఇప్పుడే తెలంగాణపై ఫోకస్ పెట్టబోనని చంద్రబాబు చెప్పినట్టు ఆయన వివరించారు. తాను ఒంటరిగా పార్టీలో చేరుతున్నారని, ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది తనకు తెలియదని చెప్పారు.