AP government plan to re open Anna Canteens before August 15
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. ఎదుటి వారికి ఏం దానం ఇచ్చినా సంతృప్తి చెందనివారు అన్నదానం చేస్తే తృప్తిగా భోజనం చేసి మనలను చల్లగా ఉండాలని దీవించి వెళతారు. అందుకే మనం ఏ శుభకార్యం చేసినా ఇంట్లో అశుభకార్యం చేసినా బంధుమిత్రులకు అన్నదానం చేస్తుంటాం. దేశంలోని ప్రధాన దేవాలయాలలో కూడా నిత్యాన్నదానంతో భక్తులను ఐహికానందాన్ని కలిగిస్తుంటారు. ఒకప్పుడు తమిళనాట అమ్మ క్యాంటిన్లకు విశేషాదరణ లభించింది. నాటి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ పథకాన్ని యావత్ దేశానికే గర్వకారణంగా మలిచింది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో దేశంలో పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని నడిపాయి.
నిరుపేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటిన్లు
స్వర్గీయ ఎన్టీఆర్ కూడా రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా కొనసాగించి పేదల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటిన్లు కేవలం రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం నడిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే గతంలో చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు అన్న క్యాంటిన్లు ఎంతో మంది పేదల ఆకలిని తీర్చాయి. రోజు కూలీలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగ యువకులు ఇలా చాలా మందికి అన్న క్యాంటిన్లు ఆకలి బాధలు తీర్చే సెంటర్లుగా మారాయి.
జగన్ సర్కార్ కక్ష సాధింపు
అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పథకాలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ వచ్చారు. అదే క్రమంలో అన్న క్యాంటీన్లను పూర్తిగా ఎత్తేశారు. దీనిపై వచ్చిన విమర్శలను సైతం జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అన్న క్యాంటిన్లు మూసివేశారు.కాగా మీ రాజకీయాల మధ్య మిమ్మల్ని ఎందుకు బలిచేస్తున్నారంటూ నిరుద్యోగులు, చిరుద్యోగులు జగన్ సర్కార్ ను నిలదీశారు అయినా ఫలితం శూన్యం. రీసెంట్ గా అధికార పగ్గాలు చేపట్టింది తెలుగు దేశం ప్రభుత్వం. మళ్లీ అన్న క్యాంటిన్లు తెరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్ధానం ప్రకారం మళ్లీ అన్న క్యాంటిన్లకు మహర్ధశ రానుంది.
ఆగస్టు 15న
అన్న క్యాంటిన్లను తిరిగి ఆగస్టు 15 లోగా తెరవాలని టీడీపీ సర్కార్ భావిస్తోంది. తొలి దశలో 183 క్యాంటిన్లను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలిచి సాధ్యమైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలని భావిస్తోంది. అప్పడు అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా నడిచిన అన్న క్యాంటిన్లు కొన్నింటికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేశారు. అయితే అవన్నీ ఇన్నాళ్లుగా మూతపడి శిథిలావస్థలో ఉన్నాయి. మళ్లీ వాటిని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది.
ఆదాయ పన్ను మినహాయింపు
స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి అన్న క్యాంటిన్లకు విరాళాలు సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఇందుకు ఎన్ఆర్ఐలు కూడా విదేశాలనుంచి భారీగా విరాళాలు పంపినట్లు సమాచారం. పైగా అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతలకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే దీనికి సంబంధించిన వెబ్ సైట్ అందుబాటులో ఉంచి ప్రజలు ఇచ్చే విరాళాలను పారదర్శకంగా ఉంచాలని చూస్తోంది. టెండర్ల ప్రక్రియకు ఈ నెల 22 డెడ్ లైన్ కాగా నెలాఖరు కల్లా టెండర్లు ఖరారు చేస్తారని సమాచారం. ఏది ఏమైనా ఆగస్టు 15 కల్లా అన్న క్యాంటిన్లను తిరిగి ప్రారంభించాలనే రాష్ట్ర సర్కార్ కృతనిశ్చయంతో ఉంది.