Nizamabad : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భర్త మరణించాడని వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వానా. ఐతే అధికారులు చెప్పిన సమాధానం విని కంగుతినడం ఆమె వంతు అయింది. దరఖాస్తు చేసుకున్న షేక్ రిజ్వానానే చనిపోయిందంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు సెర్ప్ అధికారులు.
ఫించన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..ఇలాంటి సమాధానాలతో తిరస్కరిస్తున్నారని ఆమె వాపోయారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్వేర్ లోపంతో పింఛన్లు భారీగా నిలిచిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 131 మందికి బ్రతికి ఉన్నా చనిపోయినట్లుగా పింఛన్లు రద్దు అయ్యాయి. సాప్ట్ వేర్ లోపం కారణంగా జిల్లాలో అర్హులైన దాదాపు 500 మంది బాధితులను గుర్తించారు అధికారులు