Hyderabad Police Firing: హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆ దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. మరోవ్యక్తి పోలీసులపై రాళ్లు విసిరాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తనిఖీలు చేస్తుండగా..ఇద్దరు పోలీసులపై దాడికి యత్నించడంతో అప్రమత్తమై పోలీస్ డెకాయ్ టీం వెంటనే కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన వారిని అనీస్, రాజ్గా గుర్తించారు. గాయపడిన వారితోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారంతా దోపిడీ దొంగలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. నగరంలో కాల్పులు చోటుచేసుకోవడం ఇది ఐదోసారి. నగరంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో దుండుగలకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఒకరిని ఎమెర్జెన్సీ వార్డుకు తరలించారు. ఇందులో ఒకరికి కాలికి బుల్లెట్ తగలడంతో వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణహాని లేదని వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం అబ్ధుల్లాపూర్ మెట్ వద్ద ఓఆర్ఆర్ వద్ద పార్థి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నల్లొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న ఓ దంపతులపై దాడి చేసి నగలు దోచుకెళ్లారు. తర్వాత పారిపోతుండగా.. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ తరుణంలో పోలీసులపై తిరగపడ్డారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.