TSRTC introducing smart cards(Latest news in telangana):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సత్ఫలితాలనిస్తోంది. అయితే వీరి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా ఆధార్ గుర్తింపు చూపించి మహిళలంతా ఉచితంగా బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే చాలా మంది ఆధార్ కార్డులో ఫొటోలు మార్చుకోకపోవడంతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అది తమ ఫొటోయే అంటూ కండక్టర్ తో ప్రతినిత్యం వాగ్వాదాలు చేయాల్సివస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా రాష్ట్ర సర్కార్ ఓ వినూత్న స్కీమ్ తీసుకురానుంది.
రేవంత్ సర్కార్ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక మహిళల ఆక్యుపెన్సీ బాగానే పెరిగింది. త్వరలోనే మహిళల చేతికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఈ డిజిటల్ కార్డులను స్వైప్ చేసి మహిళా ప్రయాణికులు ‘జీరో’ టిక్కెట్లు పొందవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం
త్వరలోనే టీఎస్ ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టనున్నారు. నగరాలు, పల్లెలలో సైతం డిజిటల్ చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టనుంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. యుద్ధ ప్రాతిపదికన ఆగస్షు లేక సెప్టెంబర్ నాటికి సిటీ పరిధిలోని అన్ని డిపోల బస్సు కండక్టర్లకు ఐ-టిమ్స్ ను అందించే ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ తర్వాత పల్లె ప్రాంతాలకు తిరిగే బస్సులకు సైతం ఐ-టిమ్స్ అందిస్తారు. ఇక ప్రతి ఒక్కరూ చిల్లర సమస్య లేకుండా ఆర్టీసీ కి స్మార్ట్ కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయవచ్చు. టీఎస్ ఆర్టీసీ 10.97 కోట్ల రూపాయలతో 13 వేల ఐ-టిమ్స్ కొనుగోలు చేసింది.
రోజుకు 55 లక్షలకు పైగా ప్రయాణికులు
ప్రతి రోజూ టీఎస్ ఆర్టీసీ 55 లక్షల ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇందుకోసం 9 వేలకు పైగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టే ఐ-టిమ్స్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు. టీఎస్ ఆర్టీసీ కూడా ఏరోజుకారోజు ఏ ఏ సర్వీసు ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో అప్పటికప్పుడే తెలుసుకోవచ్చు. పైగా ఐ-టిమ్స్ తో చీటింగ్ కు ఆస్కారం లేదు. అలాగే ఆర్టీసీ సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. ఏ ఏ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉందో, ఎక్కడ తక్కువ ఉందో తెలుసుకోవచ్చు. దానిని బట్టి ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా..
ఇప్పటికే భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాలలో విజయవంతంగా ఈ స్కీమ్ అమలుకావడం విశేషం. బండ్ల గూడ డిపో పరిధిలో 74 బస్సులకు 150 ఐ-టిమ్స్ అందజేశారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ఇప్పటికే ఈ ఐ-టిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి నగదు రహిత చెల్లింపులు చేపట్టాలని టీఎస్ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాలలో ఐ-టిమ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు. దాని వలన ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా? వంటి విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చారు. ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకపోవడంతో తెలంగాణలోనూ దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు ఇచ్చే స్మార్ట్ కార్డులన్నీ ఐ-టిమ్స్ లో చెల్లుబాటు అవుతాయని అంటున్నారు. అందుకే త్వరలో తెలంగాణ మహిళలకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధం అవుతున్నారు.