Kadiyam Srihari on BRS Party(Latest political news telangana): బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వలసల గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీ నాయకులకు లేదని ఘాటుగా కామెంట్ చేశారు. రాజకీయ వ్యవస్థలో విలువలు లేకుండా చేసిందే వాళ్లని, భ్రష్టుపట్టించిందే వాళ్లని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు వలసల గురించి మాట్లాడుతున్నారని ఎదురుదాడికి దిగారు. వాళ్లు మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. వాళ్లు చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. ఎందుకీ ద్వంద్వ నీతి అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు, స్పీకర్ స్పందిస్తారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
‘అసెంబ్లీలో ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రాతినిధ్యం లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేయించుకుని ప్రతిపక్షాల నోళ్లు మూయించిన మీరు.. ఇప్పుడు పునీతులైనట్టుగా, తప్పు చేయనివారుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అదంతా ఒక కుటుంబానికే పరిమితమైంది. ఎవరి దుకాణం వాళ్లదే. కుటుంబంలో ఐదుగురో.. ఆరుగురో ఉంటే ఎవరి దుకాణం వారిదే. పంచుకుని దోచుకున్నారు.’ అని కడియం తీవ్ర ఆరోపణలు చేశారు.
‘ఇవాళ కేసీఆర్ ఆస్తులుగానీ, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ కుమార్ ఆస్తులుగానీ.. 2014కు ముందు 2024లో ఎంత ఉన్నాయో ప్రజలకు చెప్పండి. మీ ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించండి. ఏ రకంగా వందల వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాలు వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ప్రజా తీర్పును గౌరవించి కొన్ని రోజులు పార్టీ వ్యవహారాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టడం మంచిది. బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాలని నేను ప్రతిపాదిస్తే.. అవహేళన చేశారు. ఈ రోజు వాళ్లే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారిస్తే నష్టం జరిగిందని చెప్పుకుంటున్నారు. గతంలొ నేను చాలా సమావేశాల్లో చెప్పాను. వారు అహంకారంతో వ్యవహరించారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు’ కడియం విమర్శించారు.
Also Read: కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రేపే ముహూర్తం
‘మీ నాయకత్వం పై నమ్మకం లేకనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, నియోజకవర్గాల అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తున్నారు. మీ నాయకత్వం సరిగా ఉంటే.. మీ పట్ల నమ్మకం ఉంటే వీళ్లంతా ఎందుకు మీ నుంచి దూరం అవుతారు?’ అని కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు సంధించారు.