Anticipatory Bail for YSRCP Leaders : వైసీపీ నేతలకు ఏపీ హై కోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూలై 16వ తేదీ వరకూ వాళ్లను అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. తదుపరి విచారణను 16కు వాయిదా వేసింది.
2021, అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడగా.. టీడీపీ నేతల ఫిర్యాదులతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డిలను అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మొత్తం ఐదుగురు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
దాడులకు కారణమైన మరికొందరు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిలో అత్యధికంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసులోనే వైసీపీ కీలక నేతలకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
Also Read : జనసేనానికి మరో బంపరాఫర్ ఇచ్చిన చంద్రబాబు
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిందితుడిగా చేరుస్తూ.. పోలీసులు కోర్టుకు నివేదికను అందజేశారు. ఈ ఘటనపై టీడీపీ ముదునూరి సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న వారందరినీ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిగిలిన వారు అజ్ఞాతంలో ఉండగా.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.