Farmer Missing case update(Local news telangana): పుట్టి పెరిగిన ఊరిలో సొంత భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న భూ బకాసురులపై పోరాడి ఓ రైతు ఓడిపోయాడు. వేధింపులు తట్టుకోలేక, మనస్థాపానికి గురై కనిపించకుండా పోయాడు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్లో జరిగింది. గ్రామానికి చెందిన మాధవ రెడ్డికి పోచంపల్లి సర్వే నంబర్ 188లో ఎకరం 13 గుంటల భూమి ఉంది. దీని చుట్టూ తమ బంధువులు, గ్రామస్తుల భూములు ఉన్నాయి. ఆ భూములపై కన్నేసిన త్రిపుర ల్యాండ్ మార్క్ ఓనర్ పసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్ వెంకటేశం, మరి కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో పలువురు రైతుల భూములను కొనుగోలు చేశారు. అదే విధంగా మాధవ రెడ్డిని సైతం తన భూమిని అమ్మాలని ఒత్తిడి తెచ్చినా ఆయన ససేమిరా అనడంతో లేఔట్ నిర్వాహకులు దౌర్జన్యానికి దిగారు.
ఈ భూమి వివాదంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా గతంలో ఇరు వర్గాలపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రెండు నెలల క్రితం బాధిత రైతులు లేఅవుట్ నిర్వాహకుల ఒత్తిడి, పలుకుబడితో జైలుకు వెళ్లి బయటికి వచ్చారు. రైతులను జైలుకు పంపించిన దుండిగల్ పోలీసులు లే అవుట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా భూమిని లాక్కోవాలన్న పన్నాగంతో చుట్టుపక్కల ఉన్న భూముల రైతులను మాధవరెడ్డిపై ఉసిగొల్పారు.
Also Read : రైతుల పక్షాన ఆలోచించాలి.. వారితో నేరుగా కలెక్టర్లే మాట్లాడాలి
తన భూమి ఇవ్వకపోతే లే అవుట్ ముందుకు సాగదని కుట్రపూరితంగా మిగతా రైతులపై ఒత్తిడి తెచ్చారు. రెచ్చిపోయిన మిగతా రైతులు నీ భూమి కూడా ఇస్తావా లేదా అంటూ అందరూ కలిసి మాధవరెడ్డిని తిట్టేలా చేశారు. ఈ క్రమంలోనే మాధవరెడ్డిని చర్చలకు పిలిచిన నిర్వాహకులు మిగతా రైతులతో కలిసి తిట్టారు. దీంతో మనస్థాపానికి గురైన అతను, దుండిగల్ సీఐ శంకరయ్యకు లెటర్ రాశాడు.
‘‘సార్ నేను భూ వివాదంలో విసిగిపోయాను. మీకు ఎన్నిసార్లు విన్నవించినా న్యాయం చేయట్లేదు. నా కుటుంబం, జాగ్రత్త, అమ్మానాన్న, పిల్లలు క్షమించండి, నా ఇబ్బందికి కారకులు నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం, త్రిపుర ల్యాండ్ మార్క్ ఓనర్ పసుపులేటి సుధాకర్’’ అంటూ పేర్కొన్నాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.