Prabhu Deva: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మని(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు మరణించారు. మైసూరులోని ఓ మారుమూల ప్రాంతంలో ఆమె జీవిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సుందరం సోదరులు హుటాహుటిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్ బయల్దేరారు.
అమ్మమ్మను కడసారి చూసేందుకు ప్రభుదేవాతో పాటు అతడి అన్నాదమ్ములు చెన్నై నుంచి మైసూరు చేరుకున్నారు. మైసూరు మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా సోదరులు కారులో ధుర అనే మారుమూల గ్రామానికి చేరుకున్నారు. పుట్టమ్మని.. సుందరం మాస్టర్ భార్య మహాదేవమ్మ తల్లి. ధుర గ్రామ మాజీ ఉపాధ్యక్షుడు మహదేవప్ప, పుట్టమ్మని కుమార్తె అయినా మహాదేవమ్మను సుందరం మాస్టర్ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు.
ప్రభుదేవా సుందరం, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ సుందరం. ముగ్గురు డ్యాన్స్ మాస్టర్స్ గానే కొనసాగుతున్నారు. ప్రభుదేవాకు అమ్మమ్మ అంటే వల్లమాలిన అభిమానం. ఆమెతో అప్పుడప్పుడు ఫోటోలు దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అమ్మమ్మ మరణించింది అని తెలియగానే షూటింగ్స్ కూడా మానేసి.. హుటాహుటినా ఆమె కడసారి చూపు కోసం పరిగెత్తాడు. ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా.. ఒకపక్క నటుడుగా ఇంకోపక్క డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రభుదేవా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.