Telangana DGP: రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ, హోం శాఖగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్ను డీజీపీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డీజీపీ నియామకం జరిగినట్టయింది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను డీజీపీగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే క్లియర్ చేశారని, మంగళవారం ఈ ప్రకటన వెలువడాల్సిందని వార్తలు వచ్చాయి. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటనలో ఉండటంతో ఈ ప్రకటన బుధవారం వచ్చినట్టు తెలుస్తున్నది. కొత్త డీజీపీ జితేందర్ రెడ్డి సారథ్యంలో పోలీసు శాఖలో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలోనూ మరింత పకడ్బందీగా నిర్ణయాలు ఉంటాయని పోలీసువర్గాలు తెలిపాయి.
ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు 2022 డిసెంబర్లో హోం శాఖ సెక్రెటరీగా తీసుకున్నారు. అలాగే.. ప్రిజన్స్, కరక్షనల్ సర్వీసెస్ డీజీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
తాజాగా ఆయనను డీజీపీగా నియమించడంతో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ సచివాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సచివాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.
తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్.#RevanthReddy pic.twitter.com/DNe4ajt89O
— Telangana Congress (@INCTelangana) July 10, 2024
డీజీపీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం జితేందర్ మాట్లాడుతూ.. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పారు. నార్కోటిక్,సైబర్ క్రైమ్ పై దృష్టి పెడుతామని వివరించారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరోకు వాహనాలు కూడా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.