ZIM vs IND Match update(Latest sports news telugu): జింబాబ్వేతో జరుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ నేడు హరారేలో సాయంత్రం 4.30కి ప్రారంభం కానుంది. అయితే రెండు జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ ఇప్పుడు రెండు జట్లకు కీలకంగా మారనుంది. ఇక్కడ గెలిస్తేనే ముందడుగు పడుతుంది. లేదంటే పరిస్థితి కొద్దిగా విషమిస్తుంది.
మరి అత్యంత ఉత్సాహంగా ఉన్న యువ భారత్ ను జింబాబ్వే నిలువరిస్తుందా? అంటే కష్టమే అంటున్నారు. మరి తొలి మ్యాచ్ లో తక్కువ స్కోరుకే కట్టడి చేశారు కదా…ఈ మ్యాచ్ లో జరగదని గ్యారంటీ ఏముంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిందేనని సీనియర్లు సూచిస్తున్నారు. టీమ్ ఇండియాకి హెడ్ కోచ్ గా గౌతంగంభీర్ రావడంతో కొన్ని సమీకరణాలు మారాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బహుశా యువజట్టుతో గంభీర్ మాట్లాడుతూ ఉండవచ్చునని, కొన్ని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే లక్ష్మణ్ పర్యవేక్షణలో ఉండటం వల్ల వేలు పెట్టకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా యువ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబె వచ్చేశారు.
Also Read : జింబాబ్వేతో మూడో టీ 20: ఆ ముగ్గురూ వచ్చేశారు
అయితే అభిషేక్ ని ఆడిస్తారా? లేక జైశ్వాల్ ని తీసుకొస్తారా? అనే అంశంపై సందిగ్ధత ఉంది. ఎందుకంటే అభిషేక్ సెంచరీ చేయడంతో అతన్ని తప్పించడం సరికాదు. అలాగే ఓపెనర్ గా జైశ్వాల్ కి మంచి రికార్డ్ ఉంది. అందువల్ల గిల్, యశస్వి ఓపెనర్లుగా వచ్చి, అభిషేక్ శర్మను ఫస్ట్ డౌన్ తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్ ఐదో స్థానంలో అడ్జస్ట్ కావాలి. రుతురాజ్ సెకండ్ డౌన్ వస్తాడు. శివమ్ దూబె, రింకూ సింగ్ ఒకరి తర్వాత ఒకరు వస్తారు.
ఇంత స్ట్రాంగ్ గా ఉన్న యువజట్టును ఎదుర్కోవడం జింబాబ్వేకు సవాల్ గా మారనుంది. కెప్టెన్ గిల్ కు ఈ మ్యాచ్ కీలకమని చెప్పాలి. తొలి రెండు మ్యాచ్ ల్లో పెద్దగా ఆకట్టుకునే రీతిలో ఆడలేదు. నిజానికి తొలిమ్యాచ్ లో తను నిలిచి ఉంటే, మ్యాచ్ గెలిచేది. అంతవరకు బాగా ఆడి అంతలో అవుట్ అయిపోయాడు.
ఇక జింబాబ్వేలో కెప్టెన్ సికందర్ రజాతో పాటు ఆల్ రౌండర్లు బెనెట్, జాంగ్వీ ఆడితే స్కోరు పెరుగుతుంది. ఇక పేసర్లు ముజరబాని, చటారాలపై జింబాబ్వే ఆశలు పెట్టుకుంది. మొత్తానికి రెండో మ్యాచ్ లో ఇండియా ధాటికి జింబాబ్వే ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. మరిప్పుడు పుంజుకుంటుందా? లేదా చూడాలి.