BJP : 2024 సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గుజరాత్ రెండో దశ పోలింగ్ ముగియగానే కార్యాచరణ రెడీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కాషాయ నేతలు పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే రాష్ట్రాల ఎన్నికలపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల అజెండాను సిద్ధం చేసేందుకు కమలనాథులు సన్నద్ధమవుతున్నారు.
ఇప్పటికే గుజరాత్లో ఏడోసారి విజయం సాధించేందుకు బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రం కావడంతో మళ్లీ గెలిచేందుకు సర్వశక్తులూ ధారపోస్తున్నారు. ప్రధాని మోదీతో సహా ఆ పార్టీ అగ్రనేతలు గుజరాత్ లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తోపాటు ఆప్ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. గుజరాత్ మోదీ స్వరాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే కీలక నేతలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. అదే రోజు నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశాల్లో వచ్చే ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. గెలుపు వ్యూహాలను రచిస్తారు. అదే విధంగా 2024 లోక్సభ ఎన్నికల వ్యూహాలపైనే చర్చించే అవకాశం ఉంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం , భారత ఆర్థికవృద్ధి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. వీటితోపాటు వచ్చే ఏడాది జరిగే త్రిపుర, కర్ణాటక, పలు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాలకు జాతీయ స్థాయిలో పార్టీ సీనియర్ నేతలతోపాటు అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. మరి మోదీ పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఎలాంటి అజెండాను రూపొందిస్తుందనేది ఆసక్తిగా మారింది.