CM Revanth Reddy: తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్లో పర్యటిస్తున్న ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. మహబూబ్నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సూచనలు ప్రభుత్వం తప్పక పాటిస్తుందని వెల్లడించారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామని అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
కేసీఆర్కు కాంగ్రెస్ ఉసురు తగిలిందని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పరీక్షలు పదే పదే వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల గురించి సభలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు.
రైతు రుణమాఫీ పూర్తి చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు పోదాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం చెప్పినట్లుగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తే అదే నెల చివర్లో లేక సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశముంది. కాగా స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. నేతల కోసం కార్యకర్తలు గత ఎన్నికల్లో కష్టపడ్డారని అదే కార్యకర్తలను సర్పంచ్ లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిపించేందుకు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన 3,500 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, అందులో ఎవరూ పైరవీలు చేసినవారు లేరని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలనే కుర్చీలో కూర్చోబెట్టాలని తెలిపారు. తనకు వచ్చిన సీఎం పదవి కూడా కార్యకర్తల కష్ట ఫలితమేనని గుర్తుచేసుకున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను తప్పకుండా ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ప్రభుత్వం హింసించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడుల సమయంలో కేసీఆర్ రాజనీతి ఎక్కడికి పోయిందని నిలదీశారు. కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందంటూ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
Also Read: అవకతవకలు లేవు.. బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటన
ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. కాగా సీఎం కూడా సర్పంచ్ ఎన్నికల గురించి ప్రస్తావించడంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల పండగ షురూ కానుంది. రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఏడు నెలల కాలంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు కూడా కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. రుణ మాఫీ చేస్తే గ్రామాల్లో ఓట్లన్నీ కాంగ్రెస్ పడతాయని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్, ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.