Usha Uthup: సింగర్ ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్(78) గుండెపోటుతో మృతి చెందారు. గతరాత్రి కోల్ కతాలోని తన నివాసంలో జానీ టీవీ చూస్తుండగా.. గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నేడు ఆయన అంత్యక్రియలు కోల్ కతాలో జరగనున్నాయి.
ఇక ఉషా ఉతుప్ గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తొమ్మిదేళ్ల వయసునుంచే సంగీత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. సంగీతకారుడు అమీన్ సయానీ ఒక రేడియో ఛానెల్లో పాడటానికి ఉషకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తర్వాత చెన్నైలోని మౌంట్ రోడ్లోని నైన్ జెమ్స్ నైట్క్లబ్లో గాయనిగా మారింది.
ఇక ఒక క్లబ్ లో ఆమె పాటకు ఫిదా అయిన శశి కపూర్.. తన సినిమాలో ఉషాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా 15 భారతీయ భాషలలో తన గాత్రాన్ని అందించింది. ఇంకా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలీ, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ తో సహా అనేక విదేశీ భాషలలో కూడా పాడింది.
తెలుగులో ఉషా అంటే హస్కీ వాయిస్. కీచురాళ్లు అనే సినిమాలో కీచురాళ్లు అనే సాంగ్ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఇక రేసుగుర్రం టైటిల్ సాంగ్ తో కూడా ఉషా తెలుగువారికి సుపరిచితురాలు. ఆమెకు మొదట రాము అనే వ్యక్తితో వివాహమైంది. ఆయన మరణించాక.. ఉషా.. జానీని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక జానీ మరణ వార్త విన్న ప్రముఖులు.. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.