30 lakhs rupees for one Kidney offer..heated by Agents
లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వారి ఊబిలో ఇరుక్కున్న సామాన్యులకు బయటకు రావడం కష్టంగా మారుతోంది. వెంటపడి..ఫోన్ కాల్స్ చేసి మరీ లోన్స్ ఇప్పించి ఆ తర్వాత లోన్ తీసుకున్న పాపానికి నరకానికి స్పెల్లింగ్ చూపిస్తున్నారు. ఒకప్పుడు మార్వాడీ లు లేక కొన్ని కార్యాలయాలు మాత్రమే అప్పులు ఇస్తుండేవి. డిజిటల్ టెక్నాలజీ పెరిగాక అప్పులు ఇచ్చే సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అంతే వేగంగా వారి ఆగడాలు సైతం మితిమీరిపోతున్నాయి. ఈ లోన్ యాప్ ల పేరిట మోసాలు దారుణంగా జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు రుణాలు పూర్తిగా కట్టించుకుని కూడా ఇంకా అధిక వడ్డీలు వేస్తూ రుణదాతలను వేధింపులకు గురిచేస్తున్నాయి. వీరి ఆగడాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్యా కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.
మిడిల్ క్లాస్ టార్గెట్
మధ్యతరగతి వర్గాలే వీరికి టార్గెట్ గా మారారు. ఎక్కువ ఆర్థిక అవసరాలు కూడా ఉండేది వారికే కావడం గమనార్హం. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన దారుణ సంఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పొట్టకూటి కోసం ఆటో డ్రైవర్ గా చేస్తున్న ఓ 31 ఏళ్ల యువకుడు లోన్ యాప్ అట్రాక్షన్ కు గురయ్యాడు. రోజువారీ అవసరాలు తీర్చుకోలేక భారీ మొత్తంలో రుణాన్ని తీసుకోవాలని ఆశించాడు. అదే అతని ప్రాణం మీదకు వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు లోన్ పేమెంట్ సదరు లోక్ యాప్ సంస్థకు కడుతునే ఉన్నాడు. వారు విధించిన డెడ్ లైన్ లోపే కట్టేశాడు. అయినా వడ్డీలు, చక్రవడ్డీలంటూ ఆటో డ్రైవర్ ను లోన్ యాప్ నిర్వాహకులు మోసం చేసి ఇంకా తీసుకున్న రుణం తీర్చాల్సిందే అంటూ వేధిస్తూ వస్తున్నారు.
ఫేస్ బుక్ లో కిడ్నీ ప్రకటన
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఆటో డ్రైవర్ ప్రతి రోజూ మానసిక సంఘర్షణకు గురవుతూ వస్తున్నాడు. రుణం ఎందుకు తీసుకున్నానా అంటూ బాధపడని రోజే లేదు. ఈ వేధింపులు తాళలేక ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే అదే సమయంలో ఫేస్ బుక్ లో వచ్చిన ప్రకటన ఆటో డ్రైవర్ ని ఆకట్టుకుంది. అర్జెంట్ గా కిడ్నీ కావాల్సి ఉందని..ఎవరైనా కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి రూ.30 లక్షలు ముట్టజెబుతామని నమ్మ బలిగారు సదరు ప్రకటనదారులు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేస్తే పేషెంట్ విజయవాడలో ఉన్నారని చెప్పి అతని పేరిట ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. వారి మాటలు నమ్మిన ఆటో డ్రైవర్ తన కిడ్నీని ఇచ్చేశాడు.
ఇలాంటి దా‘రుణాలు’ ఎన్నో
ఆ తర్వాత డబ్బులు అడుగుతుంటే అప్పుడు ఇప్పుడు అంటూ మభ్యపెట్టసాగారు కిడ్నీ దాతలు. వారి వెంట పడగా చివరకి ఏడు నెలలు తిప్పించుకుని ఆటోవాలా చేతిలో కేవలం లక్ష రూపాయలు అందించారు. తాను దారుణంగా మోసపోయానని ఆటో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు.మరో పక్క లోన్ తీర్చలేదని వేధింపులు మధ్య తాను సతమతమయిపోతున్నానంటూ వాపోతున్నాడు ఆటో డ్రైవర్. కిడ్నీ దాతలంటూ ఏకంగా ఈ రాకెట్ నడుపుతున్న ఏజెంట్లు తమకి ఫోన్ చేసినవారిని నిలువునా దగా చేస్తున్నారు. అలాంటి ఫేక్ ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు.