Kadapa by election incidcations: నిప్పు లేనిదే పొగరాదు ఈ సామెత ప్రస్తుతం వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. నిన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది ఆ పార్టీ. ప్రస్తుతం పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం కష్టమేనని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధినేతకు అసెంబ్లీ కంటే పార్లమెంట్ బెటరని అంటోంది వైసీపీ. దీంతో కడప పార్లమెంట్కు ఉపఎన్నిక తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ ఉన్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆయన్ని రేపో మాపో సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమన్నది వైసీపీ నేతల మాట. అదే జరిగితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఖాయం. ఆ సీటు నుంచి వైసీపీ అధినేత జగన్ బరిలో దిగాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
ఇందుకు కారణాలూ లేకపోలేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే రేపటి రోజైనా ఏపీలో అధికారంలోకి రావచ్చని బలంగా నమ్ముతున్నారు జగన్. ఈ బాధ్యతను మిగతా నేతలకు అప్పగించే బదులు.. తాను దిగితే బాగుంటుందని అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలోనే పార్టీ నుంచి ఆ సమాచారం బయటకు వచ్చింది. ఈ వార్త ఇంటా బయటా హంగామా చేస్తోంది.
ALSO READ: విచారణలో పిన్నెల్లి సంచలన విషయాలు.. ఆ రోజు ఏం జరిగిందంటే…
అసలు విషయానికొద్దాం.. సోమవారం (జూలై 8) వైఎస్ఆర్ బర్త్ డే జరిగింది. ఎప్పటి మాదిరిగానే వైసీపీ అధినేత జగన్ హంగామాకి వెళ్లకుండా పులివెందులలో వెళ్లారు. వైఎస్ షర్మిల తన తండ్రి బర్త్ డే వేడుకలకు ఏపీలోని మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు రావాల్సి వుంది. అయితే చివరి నిమిషంలో ఆ బాధ్యతను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి పార్టీ హైకమాండ్ అప్పగించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. కడప పార్లమెంటుకు ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ తరపున ప్రచార బాధ్యతలు తాను తీసుకుంటానని ఓపెన్గా చెప్పేశారు. ఊరూరూ తిరిగి ప్రచారం చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి తాను సిద్ధమేనని ఓపెన్గా చెప్పేశారు. ఆ గడ్డపై నుంచే కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలుపెడుతుందన్నారు సీఎం.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓపెన్గా చెప్పడంతో కడప ఉపఎన్నిక ఖాయమనే చర్చ అప్పుడే ఏపీలోని రాజకీయ పార్టీల్లో మొదలైంది. కాంగ్రెస్ తరపు నుంచి వైఎస్ షర్మిల ఈసారీ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకంగా తన అన్నపైనే ఆమె బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక వస్తే జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నరీతిలో పోటీ జరగడం ఖాయమని అనుకుంటున్నారు.
కడప పార్లమెంటుకు ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ తరపున ప్రచార బాధ్యతలు తీసుకుంటాను.
— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/KrAHOTaMUL— ChotaNews (@ChotaNewsTelugu) July 8, 2024