Ashada Masam: చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు. గురు పూజలకు, మహా విష్ణువును పూజించడానికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు వరాహిదేవి ఆరాధనకు ప్రాధాన్యత ఉన్నమాసం ఆషాఢమాసం. మహా విష్ణువు యోగ నిద్రలోకి ఏకాదశి రోజు చేరుకోవడం చేత ఈ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గురుపూజలకు, గురువు ఆదరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా ఆషాఢ పౌర్ణమిగా జరుపుకుంటారు.
ఆషాఢ పౌర్ణమి రోజు వేద వ్యాసుల వారిని పూజించి వ్యాసుల వారు అందించిన మహాభారతం, అష్టాదశ పురాణాలు వంటివి ఏదో ఒకటి చదువుకొని వ్యాసుల వారిని స్మరించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని చెబుతుంటారు. గురు పౌర్ణమి రోజు సంప్రదాయం ప్రకారం గురువులను పూజించాలి. గురు పౌర్ణమి రోజు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను అనుసరించి గురువులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారిని పూజించాలి.
ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజుల్లో వారాహీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. వరాహి దేవిని ఈ మాసంలో పూజించడం వల్ల బాధలు నశించి శత్రువులపై విజయం కలుగుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించడం చేత ఆపదలు తొలగి శత్రువులపై విజయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో చతుర్మాస దీక్షలు, వ్రతాలు చాలా విశిష్టమైనవి. అందువల్ల ఎవరైతే సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నాలుగు నెలల చతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు.
యోగిని ఏకాదశి:
యోగిని ఏకాదశి వ్రతాన్ని జ్యేష్ట మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువును పూజిస్తారు. విష్ణుమూర్తిని వ్రతం ప్రకారం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
అమావాస్య:
జేష్ట మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య తిథిని జేష్ట లేదా మన్నేటినామావాస్య లేదా దర్శ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుల్లో పవిత్ర నదీ జలాలతో లేదా పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిది.
బోనాల జాతర, గుప్త నవరాత్రులు:
జూలై 6వ తేదీ నుంచి శనివారం నార్త్ ఇండియాలో గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రథయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
దేవశయతి ఏకాదశి:
ఆశాడ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథిని అతి దేవశయతి, ఆషాఢ ఏకాదశి అని అంటారు. ఈ సమయంలో నాలుగు నెలల పాటు విష్ణువు యోగనిద్రలోకి వెళతాడు.
గురు పౌర్ణిమ:
ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ రోజున గురువులను పూజించి వారికి కానుకలు సమర్పిస్తారు.
సంకష్ట చతుర్థి:
ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినే సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఎక్కువగా ఈ రోజు గణపతి పూజ ఉపవాసం చేస్తారు.