Maldives invites Team India: దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యాటక సంస్థలు.. భారతీయులను ఆకర్షించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టును తమ దేశంలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రపంచ కప్ విజయోత్సవాన్ని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుని, మరపురాని క్షణాలను సొంతం చేసుకోవాలంటూ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి.
మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (ఎంఏటీఐ), మాల్దీవులు మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్(ఎంఎంపీఆర్సీ)లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. టీమిండియాకు ఆహ్వానం పలుకుతున్నట్లు అందులో పేర్కొన్నాయి. ‘ఇరుదేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక సాంస్కృతిక, క్రీడా సంబంధాలు ఉన్నాయి. భారత క్రికెట్ జట్టును స్వాగతించడం, వారి విజయోత్సవంలో పాలుపంచుకోవడం మాల్దీవులకు గౌరవంగా భావిస్తున్నాం. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ ఎంఎంపీఆర్సీ సీఈఓ, ఎండీ ఇబ్రహీం షియురీ, ఎంఏటీఐ సెక్రటరీ జనరల్ అహ్మద్ నజీర్ పేర్కొన్నారు.
Also Read: వచ్చేదెవరు? వెళ్లేదెవరు..? జట్టులో చేరిన సంజూ, యశస్వి, దూబె
అయితే, ఇటీవలే బార్బడోస్ వేదికగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పర్యాటకులకు పిలుపు ఇచ్చారు. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలన్నారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. అది కాస్త ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి వెళ్లింది. దీంతో అనేకమంది భారతీయ పర్యాటకులు.. ఆ దేశ టూర్ ప్లాన్ను విరమించుకున్నారు. ఈ క్రమంలో తమ దేశానికి రావాలంటూ భారత క్రికెట్ జట్టుకు ఆహ్వానం పలకడం ఆసక్తిగా మారింది.