Free Sand Supply in AP : ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే.. ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాల జీఓ విడుదల చేసింది. ఈ విధి విధానాలు కొత్త ఇసుక విధానానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. అక్రమ ఇసుక అమ్మకాలకు తెరదించాలన్న సంకల్పంతోనే ఈ విధానాన్ని అమలు చేసినట్లు చెప్పింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా స్టాక్ పాయింట్లను జిల్లా స్థాయి అధికారులు స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఇంటి నిర్మాణాలకు ఇసుకను ఫ్రీ గా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటివనరులలో డిసిల్టేషన్ ప్రక్రియను చేపట్టాలని, దానిపై జిల్లా స్థాయి కమిటీలు చర్చించి చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read : ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం..ఉదయం 6 గంటల నుంచే!
ఇక ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను కూడా జిల్లా కమిటీలే నిర్ణయించాలని, వాటిని కేవలం డిజిటల్ విధానంలోనే జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. ఇసుకను విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. ఇంటి నిర్మాణాలకు మినహా.. మిగతా అవసరాలకు ఉచిత ఇసుక పాలసీని వినియోగించరాదని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అక్రమంగా రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు విధిస్తామని చెప్పింది.