Anjali Sarvani : ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణికి చోటు దక్కింది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుంది.
టీమ్ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక కావడంపై ఆదోని ప్రాంతంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంజలి తల్లి గృహిణిగా ఉన్నారు. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసింది అంజలి. జూనియర్ లెవల్ లో బాగా రాణించి భారత జట్టుకు ఎంపికైంది.
25 ఏళ్ల అంజలి లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ బౌలర్. ఇటీవల ఇండియా -ఏ, ఇండియా-బీ, ఇండియా-సీ జట్ల మధ్య జరిగిన టోర్నిలో అంజలి ఆడింది. భారత్- ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించి పేసర్ బౌలర్ గా రాణించింది. ఈ ప్రదర్శనతో ఇప్పుడు భారత్ జట్టులో స్థానం దక్కించుకుంది.