CNAP New Feature Service to Curb Spam Calls: మొబైల్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ యూజర్స్ మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు సరికొత్త దారులను వెతుక్కొని బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా, పెరిగిపోతున్న మొబైల్ మోసాలను చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్తగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(సీఎన్ఏపీ) అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
సీఎన్ఏపీ సర్వీసును అన్ని టెలీకం కంపెనీలు విధిగా పాటించాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ కొత్త ఫీచర్ జూలై 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఎవరు ఫోన్ చేస్తున్నారో వారి నంబర్ మాత్రమే కనపడేందుకు అవకాశం ఉండేది. కొత్త ఫీచర్తో ఫోన్ చేస్తున్న వారి నంబర్తోపాటు పేరు కూడా డిస్ ప్లేపై కనిపించనుంది.
సిమ్ లేదా ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో వినియోగదారులు అందించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా టెలీకంకంపెనీలు పేర్లను డిస్ ప్లే చేయనున్నాయి. అంతేకాకుండా డిజిటల్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్రం..నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది.
గత కొంతకాలంగా ప్రతీ ఒక్కరికీ స్పామ్ కాల్స్ బెడద విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ రోజులు పదికిపైగా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్లు సైతం అవసరమైన సమాచారాన్ని పసిగట్టలేకపోతున్నాయి. ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్.. కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. దీంతో ట్రూ కాలర్ అవసరం లేకుండానే..ఎవరైతే మీకు ఫోన్ చేస్తున్నారో వారి వివరాలను ఖచ్చితంగా తెలుసుకునే వీలు ఉంటుంది.
టెలీకం ఆపరేటర్లు ఈ కొత్త ఫీచర్ను అమలు చేసేందుకు మొదట సముఖత వ్యక్తం చేయలేదు. ఈ ఫీచర్లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని దాటవేసింది. కానీ ప్రభుత్వంతోపాటు ట్రాయ్ ఒత్తిడితో ముంబై, హర్యానా ప్రాంతాల్లో సీఎన్ఏపీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రయోగించాయి. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించాయి. దీంతో జూలై 15 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది.
Also Read: రెడ్మీ నుంచి బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లు.. జులై 9న లాంచ్!
ట్రూ కలర్ యాప్ విషయానికొస్తే.. సంబంధి నంబర్ను ఎక్కువమంది ఏ పేరుతో సేవ చేసుకుంటారో.. అదే పేరు కనిపిస్తుంది. ఇందులో కొన్ని నంబర్ల వివరాలు తెలియవు. కానీ సీఎన్ఏపీ ఫీచర్లో ఫోన్లో సేవ్ చేయని నంబర్ల వివరాలు సైతం తెలిసిపోనున్నాయి. సిమ్ కార్డు ఏ పేరుతో రిజిస్టర్ అయిందో.. అదే పేరు డిస్ ప్లే కానుంది. ఈ విధానంతో స్పామ్ కాల్స్ బెడదకు దాదాపు చెక్ పెట్టవచ్చు. ఈ కొత్త సేవలు జూలై 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.