Bandi Sanjay latest comments(Telangana politics): తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? దాదాపు కారు పార్టీ ఖాళీ అయినట్టేనా? ప్రస్తుతమున్న నేతలు మిగతా పార్టీలతో టచ్లో ఉన్నారా? కొందరు అధికార కాంగ్రెస్ వైపు.. మరికొందరు బీజేపీ వైపు వెళ్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయకుండా తమకు లైఫ్ ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరి ఇల్లు వారు చక్కబెట్టుకునే పనిలోపడ్డారు.
తాజాగా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ పార్టీ నేతలైనా తమ పార్టీలోకి రావాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయని అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరాలంటే కచ్చితంగా రాజీనామా చేసి రావాలన్నది తొలి కండీషన్. ఇక రెండోది.. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టేశారు. ఈడీ, సీబీఐ విచారణకు బీజేపీతో సంబంధం లేదని, అవినీతి పరులను తమ పార్టీ దగ్గరకు రానివ్వదని తేల్చి చెప్పేశారు.
రాజ్యాంగం ప్రకారం నడుచు కోవాలంటే కేంద్రమంత్రి బండి సంజయ్ మాటలు ముమ్మాటికీ నిజమని అంటున్నారు రాజకీయ నేతలు. తెలంగాణ విషయానికొద్దాం. తెలంగాణలో చాలామంది నేతలు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాంటివారు చాలామంది ఉన్నారనుకోండి. వారిలో కొందరిపై ఈడీ, ఐటీ, సీబీఐ కేసులున్నాయి. ఇప్పుడు వాళ్లు పార్టీ మారాలని భావిస్తున్నారు.
ALSO READ: దేవుడా నీ భూమికి నీవే రక్ష..దేవుడి భూములు అన్యాక్రాంతం
కారు పార్టీలో కేసులనున్న నేతలకు తమ పార్టీ ఆహ్వానించదని చెప్పకనే చెప్పేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. దీనికి కారణాలు లేకపోలేదు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిలో ఒకరిద్దరిపై ఈడీ కేసులున్నాయి. వాళ్ల రాకను ఆయన ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ లెక్కన ఆయా నేతలు చూపు ఎటువైపు పడుతుందో చూడాలి.