TDP leaders on Byreddy Siddharth Reddy(Andhra politics news): వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోర పరాజయం పాలైంది. దాంతో ఫలితాల మరుసటి రోజే ఆ పార్టీ నేతల రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. మాజీలు, కీలకముఖ్య నేతలు.. ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీ, జనసేనల వైపు చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉంటారో? లేదో తెలియని పరిస్థితి. ఆ క్రమంలో పలు మున్సిపాల్టీల్లో పాలకవర్గాలు మారిపోయే పరిస్థితి నెలకొంది. ఆ లిస్టులో కర్నూలు జిల్లా నందికొట్కూరు చేరింది. అక్కడ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరిపోయారు. దాంతో ఇంత కాలం అక్కడ చక్రం తిప్పిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధరెడ్డి ఇప్పుడు జనానికి ముఖం చూపించేలేకపోతున్నారంట.
వైసీపీలో ఎవరుంటారో ? ఎవరు జంప్ అవుతారో అన్నది అర్థం కాకుండా తయారైంది. టీడీపీ, జనసేనలు గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నా.. అధికారపక్షం నేతలు మాత్రం.. వెయిట్ ఎండ్ సీ.. పాలసీ అవలంబిస్తున్నారు. శాసనమండలిలో మెజార్టీ ఉన్న వైసీపీకి ఇప్పుడా ఆనందం కూడా మిగిలేలా కనిపించడం లేదు.. పలువురు ఎమ్మెల్సీలు కూటమి నేతలతో టచ్ ఉన్నారన్న సమచారంతో.. జంపింగ్ల విషయంలో మాజీ సీఎం జగన్ సైతం చేతులెత్తేసిన పరిస్థితి. ‘ఉండేటోళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లను మనం ఏం చేయగలం.. ఎన్నాళ్లని ఆపగలం’ అని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా చెప్పేయడంతో ఇక తట్టా బుట్టా సర్దేయడానికి ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
అదలా ఉంటే వైసీపీ తమ కంచుకోటగా భావించిన కర్నూలు జిల్లాలో ఈ సారి ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది. వైసీపీ బలంగా ఉందని భావించిన నందికొట్కూరులోనూ చాలా ఏళ్ల తర్వాత టీడీపీ పాగా వేసింది. నందికొట్కూరులో అంతా తానే అన్నట్లు వ్యవహరించి షాడో ఎమ్మెల్యేగా ఉన్న యువనేత, మాజీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద షాకే తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు వైసీపీకి హ్యాండిచ్చేశారు.
Also Read: మార్గాని భరత్ మనసు మార్చుకోనున్నారా?
మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ నెంబర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. సొంత నియోజకవర్గంలో లీడర్లను నిలబెట్టుకోలేకపోయిన బైరెడ్డి సిద్దార్ధ గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్తో సహా, పార్టీ లీడర్లు చాలా బిల్డప్ ఇచ్చేవారు.. ఎంతలా అంటే.. యువనేత, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన ఉడుకు రక్తం, బైరెడ్డి అంటే లెక్కే వేరులే.. ఇలా ఒకటా రెండా ఓ రేంజిలో వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ఆకాశానికి ఎత్తేవారు. జగన్ అయితే నా తమ్ముడు అసలుసిసలు యువనాయుకుడు సిద్దార్థ అంటూ వాటేసుకుని మరీ చెప్పుకొచ్చారు.
సీన్ కట్ చేస్తే.. రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు బైరెడ్డి సిద్దార్థను నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు. ఈ చేరికల వ్యవహారంపై బైరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంతో కాని అతని గురించి ఎంత బిల్డప్ ఇచ్చార్రా.. బాబూ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి.