Bharat Ratna to Rahul Dravid – Gavaskar urges Government: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన్ కోచ్ గా తన మూడేళ్ల పదవీ కాలాన్ని ఇటీవలే ముగించిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల తరువాత టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వాన భారత్ ఫైనల్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. కాగా, జూన్ చివరితో కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ ముగించాడు. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ పలు వ్యాఖ్యలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం.. రాహుల్ ద్రవిడ్ ను భారత రత్నతో గౌరవిస్తే బాగుంటుందన్నాడు.
‘రాహుల్ ద్రవిడ్ ను భారతరత్న బిరుదుతో సత్కరిస్తే సముచితంగా ఉంటుందనేది నా అభిప్రాయం. గొప్ప కెప్టెన్, మంచి ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లాండ్ లోనూ టెస్టు సిరీస్ లను గెలిచిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడు. ఇటు జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా కొత్త టాలెంట్ నూ ప్రోత్సహించాడు. సీనియర్ జట్టుకు కోచ్ గానూ వ్యవహరిస్తూ అద్భుత ఫలితాలు రాబట్టాడు.
ఈ ఏడాది ప్రారంభంలో పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించింది. సమాజానికి వారు చేసిన సేవలకు గానూ ఆ పురస్కారాన్ని అందించింది. ఇప్పుడు ద్రవిడ్ సాధించిన లక్ష్యాలు కూడా అన్ని వర్గాలను అలరించాయి. అందుకే దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం అందుకోవడానికి రాహుల్ ద్రవిడ్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేందుకు నాతో కలుస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ శరద్ ద్రవిడ్.. భారత రత్న.. ఈ మాట వింటుంటేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.
Also Read: వింబుల్డన్ సెంటర్ కోర్టులో క్రికెట్ లెజెండ్కు అరుదైన గౌరవం..
ప్రధాన కోచ్ గా ద్రవిడ్.. ఆటగాళ్లను ముందుండి నడిపించాడు. అయితే, తన కెరీర్ లో ఎప్పుడూ కూడా ద్రవిడ్ స్వార్థంతో ఆడలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అతను భావించాడు. డే ముగింపు రోజులోనూ వికెట్ పడితే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండేవాడు ద్రవిడ్. అతడిని నైట్ వాచ్మన్గా పిలుస్తారు. కానీ, అతడి విషయంలో మాత్రం ఆ పదం సరికాదు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎవరూ ఆ చివరి నిమిషాల్లో ఆడేందుకు ఆసక్తి కనబర్చరు. ఈసారి వరల్డ్ కప్ లోనూ భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నది. అలాంటప్పుడు కూడా నిశ్శబ్దంగా ఆటగాళ్లను నడిపించిన తీరు చాలా బాగుంది’ అంటూ గావస్కర్ పేర్కొన్నాడు.