Telengana Cabinet Extention postponed due to the not having good days
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఆరు నెలలు పూర్తయి ఏడో నెల కొనసాగుతోంది. మార్చి నెల నుంచే మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ మంత్రి వర్గ విస్తరణకు ఆటంకంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. దీనితో మళ్లీ మంత్రి వర్గ విస్తరణపై ఆశలు రేకెత్తాయి. ఇందుకు తగినట్లుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో అదిగో మంత్రి వర్గ విస్తరణ అంటూ మీడియాలో అత్యుత్సాహంగా తేదీలు కూడా ఖరారైపోయాయి.సీఎం ఐదారు రోజులుగా ఢిల్లీ పెద్దలను కలిసి మంత్రి వర్గ విషయంలో క్లారిటీ కూడా తీసుకున్నారు. ఇంతలో ఏమయిందో హటాత్తుగా మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కానున్నట్లు సంకేతాలు వచ్చాయి.
మళ్లీ మొదటికొచ్చిన సమస్య
మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి వారు తమ వారికి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయినా ఫైనల్ నిర్ణయం రేవంత్ కే అధిష్టానం అప్పజెప్పినట్లు సమాచారం. ఇక అదంతా పక్కన పెడితే అయితే అందరూ ఊహిస్తున్నట్లుగా మంత్రి వర్గ విస్తరణ మరో నెల రోజులు ఆలస్యం కానుంది. ఇందుకు కారణం లేకపోలేదు. జులై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అయింది. సాధారణంగా తెలుగు రాష్ట్రలలో ఆషాఢం సెంటిమెంట్ ఉంది. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు ముహూర్తం కూడా ఉండదు. ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసం శుభ ముహూర్తాలకు సెంటిమెంట్ గా మంచిదని భావిస్తారు. పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు ఆషాఢ మాసంలో మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసుకోవడం ఉత్తమం అని రేవంత్ కు సూచించినట్లు సమాచారం.
పట్టుబిగిస్తున్న సీనియర్లు
సీఎం రేవంత్ తో కలుపుకుని ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే తొలిసారి మంత్రి వర్గంలో కొన్ని నియోజకవర్గాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు తమకు మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి వర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. ఈ సారైనా తమకు పదవి దక్కాలని కోరుకుంటున్నారు. అలాగే మైనారిటీ వర్గాలనుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడానికి మరింత సమయం కావలసి ఉంది. దీనికి తోడు ఆషాఢం కలిసొచ్చింది అధిష్టానానికి.