Nirmala Seetharaman cross the Murarji Desai record in Budget Introduce
మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ సర్కార్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. జులై 22 నుంచి ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్రం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి అమోద ముద్ర సైతం వేశారు. విశేషం ఏమిటంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
సంఖ్యా పరంగా పది సార్లు
ఇప్పటిదాకా సంఖ్యాపరంగా పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీదేశాయ్ పేరు మీదే ఉండటం విశేషం. ఇప్పటిదాకా ఈ రికార్డు ను ఎవరూ క్రాస్ చేయలేదు. పీడీ దేశ్ ముఖ్ కూడా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే వరుసగా గ్యాప్ లేకుండా ఏడేళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు. 2019 మే 30 నుంచి నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా అదే ఏడాది మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అక్కడినుంచి వరుసగా 2020-21, 22,23,24 వరకూ బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
వరుసగా ఏడో సారి
ఇప్పటిదాకా వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సీనియర్ నేత మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును 7వ సారి బడ్జెట్ పెట్టబోతున్న నిర్మలమ్మ తుడిచేయనున్నారు. అయితే ఇప్పటిదాకా రెండు సెషన్లలో సజావుగా సాగిన బడ్జెట్ సమావేశాలు ఈ సారి బలమైన ప్రతిపక్షం ఉండటంతో మోదీ ప్రభుత్వానికి చికాకులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.